ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలిశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల బృందంతో కలిసి కేంద్రంతో కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో గోదావరి, కృష్ణా నదీ జలాల పంపిణీ, ఏపీలో కొనసాగుతున్న జల వివాదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ వంటి కీలక అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ పరిణామాలు కూడా రేవంత్ ఢిల్లీ పర్యటనకు మరింత ప్రాధాన్యత తెచ్చాయి. కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం కాంగ్రెస్ అధిష్ఠాన నేతలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు సమాచారం. తెలంగాణలో పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ మార్పులపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణను విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ హైకమాండ్… అదే తరహా వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మంత్రిపదవుల ఆశావహుల అసంతృప్తికి చెక్ పెట్టేలా నిర్ణయాలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో రేవంత్ ఢిల్లీ పర్యటన ముగిసేలోపు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది.
ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర అనుమతులు, నిధుల కోసం ప్రయత్నాలు… మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానంతో కీలక రాజకీయ చర్చలు… ఇలా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండు కోణాల్లోనూ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ మార్పులపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బృందం బిజిబిజీ.
20
previous post