తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామని పేర్కొంది. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించింది. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను కొట్టివేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామన్న సుప్రీంకోర్టు.. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించారు. మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది ధర్మాసనం.
CVR NEWS
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష అనుభవం కలిగిన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. ఏప్రిల్ లో పదవీ విరమణ పొందనున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు కట్టకూడదని అభ్యంతరం పెడితే ఎలా? ఇలాంటి ఆలోచనా విధానం వల్లే సమస్యలొస్తున్నాయని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అటవీశాఖ అధికారులు ప్రతిదానికీ అడ్డంకులు పెడుతున్నారని, ఏ పనీ ముందుకు సాగనివ్వడం లేదని కొందరు కలెక్టర్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారి తీరుపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి.
నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు. బాహుబలి, కల్కి, ట్రిపుల్ ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలుగు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్కు తీసుకు వచ్చారన్నారు.
నెట్ ఫ్లిక్స్ కు దేశంలోనే హైదరాబాద్ ది రెండో కార్యాలయం అని సీఎం చెప్పారు. తమ దృష్టి హాలివుడ్ పైననే అని గతంలోనే చెప్పానని అన్నారు సీఎం. నెట్ ఫ్లిక్స్ తో తన కల నిజం కాబోతుందన్నారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, విస్తరణకు.. పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే కొత్త రేట్లను వసూలు చేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్పై ఏకంగా 55 పాకిస్థానీ రూపాయలు పెంచింది. ప్రకటన వెలువడిన వెంటనే వ్యాపారులు నూడుల్స్, టూత్పేస్ట్, బిస్కెట్లు, స్థానికంగా తయారైన చాక్లెట్లు వంటి రోజువారీ వస్తువుల ధరలను పెంచేశారు. చిన్న వస్తువులు కొనడానికి దుకాణానికి వెళితే, ప్రతీ వస్తువుపై 10 రూపాయలు పెంచారని ప్రజలు ఆందోళ చెందుతున్నారు. ఈ ఆరోపణలపై వ్యాపారులు స్పందిస్తూ.. రవాణా, పంపిణీ ఖర్చులు పెరగడం వల్లే ధరలను సర్దుబాటు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ధరలు తగ్గినప్పుడు తాము నష్టపోతాం కాబట్టి సర్దుబాటు చేసుకోవాలని ఆబ్పారా మార్కెట్లోని ఓ దుకాణదారుడు గులాం ఉల్లా తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన ఆరోపించారు. హోల్సేల్ డీలర్లు, రవాణాదారులు ధరలు పెంచడంతో పప్పుధాన్యాల ధర కిలోకు 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగిందని రావల్పిండి అసోసియేషన్ ఛైర్మన్ సలీం పర్వేజ్ బట్ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు పెరిగాయని…బిజినెస్ రికార్డర్ నివేదిక తెలిపింది. దీని ప్రభావంతో ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పాకిస్థాన్పై తీవ్ర భారం పడుతోందని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ భారాన్ని ప్రజలపై మోపింది. ప్రస్తుతం లీటర్పై పెంచిన 55 రూపాయలు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. కూరగాయల సరఫరా సరిపడా ఉన్నప్పటికీ, టమాటా, మిర్చి వంటి వాటి ధరలు కూడా మార్కెట్లలో విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి హోల్సేల్ మార్కెట్, కమిషన్ ఏజెంట్లే కారణమని చిల్లర వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు భారత్లో గ్యాస్ కష్టాలను తెచ్చిపెడతాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, పెట్రోలియం శాఖ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, దేశంలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం మార్చి 8న జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. దేశంలోని రిఫైనరీలు, పెట్రోకెమికల్ సంస్థలు తమ ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించింది. పారిశ్రామిక అవసరాల కంటే గృహ వినియోగదారులకు సరఫరా చేయడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ పంపిణీని కొంతవరకు క్రమబద్ధీకరించారు. కానీ ఆస్పత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర సేవలకు మాత్రం ఎలాంటి కోత లేకుండా నిరంతరం వాణిజ్య ఎల్పీజీ సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.
గ్యాస్ సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. గ్యాస్ ఏజెన్సీలు, నిల్వ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని, అక్రమ నిల్వలు చేసే వారిపై నిఘా ఉంచాలని సూచించింది. ప్రతిరోజూ గ్యాస్ సరఫరా స్థితిగతులను పర్యవేక్షించాలని డీజీపీలకు ఆదేశాలు అందాయి. అలాగే, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిని అస్సలు వదలవద్దని హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరతపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. పాత వీడియోలు లేదా సంబంధం లేని ఫోటోలను పెట్టి ప్రజలను భయపెట్టే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని, అవగాహన కల్పించాలని కోరింది. దీనికోసం కేంద్ర హోంశాఖ, సమాచార ప్రసార శాఖ, పెట్రోలియం శాఖల సమన్వయంతో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. గ్యాస్ సరఫరాపై ఏవైనా అనుమానాలు ఉంటే రాష్ట్రాలు వెంటనే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా స్పష్టత పొందవచ్చని తెలిపింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.
తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఇవాళ తుది తీర్పును వెలువరిచింది. ఈ కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ జరిపి, తగిన నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వివరించారు. అయితే, అభిషేక్ మను సింఘ్వీ వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకున్నందున, ఇక ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన కోర్టు విచారణ ముగిసినట్లేనని ప్రకటించింది. అదేవిధంగా 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలు ఫిర్యాదుదారులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ..విశాఖపట్నం ఇప్పటికే డేటా సెంటర్ హబ్గా మారుతోందని వారికి వివరించారు లోకేష్. దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే విశాఖలో ప్రారంభం కానున్నాయని తెలిపిన మంత్రి…ఇప్పటికే TCS, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తుచేశారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటం ఐటీ ఎకో సిస్టమ్కు మరింత బలాన్నిస్తుందని వెల్లడించారు. విశాఖలో కనీసం 20 వేల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ను ఏర్పాటు చేయాలని కోరారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించారు.
మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఐమాన్ ఇజ్జత్. 1967లో పారిస్ కేంద్రంగా ప్రారంభమైన తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.4 లక్షల మంది ఉద్యోగుల్లో, దాదాపు 2 లక్షల మంది భారత్లోనే ఉన్నారని వెల్లడించారాయన. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై సహా 13 భారతీయ నగరాల్లో క్యాప్ జెమినీ కార్యకలాపాలు సాగిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్ లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు. వంటగ్యాస్ కొరతపై ఆందోళన వద్దని, సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు. భారత్ వ్యవహారాలను అమెరికా శాసిస్తోందని విమర్శించారు. యుద్ద సమయంలో హర్మూజ్ జలసంధి నుంచి దిగుమతులు ఆగిపోయాయని గ్యాస్ కొరతతో దేశం అల్లాడిపోతుందన్నదన్నారు.