చైనాలో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని సమాచారం. చైనాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులు, ఎన్నారైలు తీవ్రమైన సమస్యలు, ఆంక్షలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్కు వ్యతిరేకంగా చైనా సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన దుష్ప్రచారం జరుగుతోందని, భారతీయ నిపుణులకు వర్క్ వీసాలు నిరాకరించడం, వారి జీవిత భాగస్వాముల ఉపాధిపై కఠిన ఆంక్షలు విధించడం వంటి చర్యలతో తాము నానా ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. చైనాలోని భారత రాయబార కార్యాలయం ఇటీవల ఏర్పాటు చేసిన ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రవాస భారతీయులు తమ చేదు అనుభవాలను బహిరంగంగా వెళ్లగక్కారు.
ప్రవాసుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు భారత రాయబార కార్యాలయం ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చైనీస్ ఆన్లైన్ వేదికల్లో భారతీయుల ఆహార అలవాట్లు, ఆచారాలు, సాంస్కృతిక సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని దారుణంగా దూషించే కంటెంట్ విపరీతంగా పెరుగుతోందని ప్రవాసులు అధికారుల దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా అర్హత కలిగిన భారతీయ నిపుణులకు చైనా ప్రభుత్వం ఉద్యోగ వీసాల జారీని గణనీయంగా తగ్గించిందని, కాన్సులర్ సేవల్లో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని వాపోయారు. ప్రవాసులు లేవనెత్తిన ఈ అంశాలపై చైనా అధికారులతో మాట్లాడి తగిన పరిష్కారం చూపుతామని రాయబార కార్యాలయ అధికారులు వారికి హామీ ఇచ్చారు.