వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి లో పరువు హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడి బంధువులు ఆగ్రహంతో ఉప్పరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సినపెల్లి భాస్కర్, నిఖిత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావటంతో మూడేళ్ల క్రితం నికితకు వేరే యువకుడితో వివాహం జరిపించారు. నిఖిత కి పెళ్లి ఇష్టం లేకపోవడం తో ఇటీవల విడాకులు తీసుకుంది. అయితే తన కూతురి కాపురం కూలిపోవడానికి భాస్కరే కారణమని కక్ష పెంచుకున్నాడు నికిత తండ్రి. హైదరాబాద్ మాదాపూర్ హాస్టల్ లో ఉంటున్న భాస్కర్ ను నికిత తండ్రి, మరికొందరుకలిసి దాడి చేసి దారుణంగా హతమార్చారు. భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడనే వార్త ఉప్పరపల్లి గ్రామానికి చేరడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన భాస్కర్ బంధువులు, దళిత సంఘాల నాయకులు ఉప్పరపల్లి లో రోడ్డు వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు ఏవీ జరగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు.
Crime
అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్సైకిళ్లు ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే బైక్పై ప్రయాణిస్తున్న సోంబత్తిన నారాయణ, లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు రాజంపేట మండలం గాలివారిపల్లె గ్రామానికి చెందిన దంపతులుగా పోలీసులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పంచనామా అనంతరం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల మైనర్ బాలికకు చాక్లెట్లు ఆశ చూపించిన ఉత్తరప్రదేశ్కు చెందిన రెహన్ , ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. రాయచోటిలోని పాత ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కేసు వివరాలను వెల్లడించారు.ఈ నెల 7న రామాపురం మండలంలో గంజాయి తరలిస్తున్న గాలివీడు మండలానికి చెందిన కమలాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని విచారణలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయిందని ఎస్పీ తెలిపారు.దీంతో బీహార్కు చెందిన ప్రకాష్, విశాఖపట్నానికి చెందిన బోడన్నా, రాయచోటికి చెందిన ఖాదర్బాషాలను రామాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఒడిశా నుంచి అరకు మీదుగా గంజాయిని తీసుకొచ్చి అన్నమయ్య జిల్లాతో పాటు బెంగళూరులో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ వెల్లడించారు.
పోలీసుల కళ్లుగప్పేందుకు పోర్టర్ యాప్ను వినియోగిస్తూ కొనుగోలుదారులకు సమాచారం చేరవేసి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడిందన్నారు. ఈ వ్యవహారంపై కర్ణాటక పోలీసుల నుంచి కూడా సమాచారం అందినట్లు తెలిపారు.నిందితుల వద్ద నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన 6 కిలోల గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన లక్కిరెడ్డిపల్లె సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బందిని నగదు బహుమతులతో అభినందించారు.
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఒక రద్దీగా ఉండే పబ్లో ఒక్కసారిగా అంటుకున్న భారీ మంటల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా థాయ్లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటికి వరకు 27 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. అలాగే మంటల్లో చిక్కుకుని గాయపడిన మరికొంత మందిని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించామని, వారికి మెరుగైన వైద్యం అందుతోందని వెల్లడించారు. పబ్లో మంటలు చెలరేగడానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదురై సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు, ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రులకు పంపించారు.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు మాత్రమే కృష్ణలంకలో విచారించేందుకు అనుమతిస్తూ, మిగిలిన ఏడు రోజుల విచారణను రాజమండ్రి సెంట్రల్ జైలులోనే నిర్వహించాలని పేర్కొంది. అలాగే విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్తో జరగాలని ఆదేశించింది. అయితే ఈ పరిమితుల వల్ల కేసుకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలికితీయడం కష్టమవుతోందని సిట్ వాదిస్తోంది. అందువల్ల సమగ్ర దర్యాప్తు కోసం హైకోర్టు విధించిన షరతులను సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, సాయికృష్ణ లాకప్డెత్ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో తమకు ఇవ్వాలంటూ బుధవారం రోజు సిట్ను ఆదేశించింది హైకోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో లక్కీ స్కీం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. కారుణ్య లక్కీ స్కీం పేరుతో సుమారు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన తంగుడు శ్రీధర్, దాదాపు రూ.80 లక్షలతో పరారైనట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది . ఈ ఘటనతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మోసానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.
చిత్తూరు నగరంలోని ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు . పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సమన్వయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు . ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఘటనపై విచారణ కొనసాగుతోంది.
కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ఎనిమిది ప్రత్యేక బృందాలతో వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నారి తల్లి భవాని మీడియాతో మాట్లాడుతూ, కేసు దర్యాప్తుపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. చిన్నారి ఆచూకీపై ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.



Total views : 221439