అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు. ఈ కుట్రకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ నివేదికలను డీక్లాసిఫై చేసి ప్రజల ముందు ఉంచుతానని ప్రకటించారు.
2020 ఎన్నికల సమయంలో మొదలైన ఈ ప్రక్రియ ద్వారా చైనా అక్రమంగా అమెరికన్ ఓటర్ల ఫైళ్లను సంపాదించిందని ట్రంప్ ఆరోపించారు. “ఈ డేటా నష్టం మన ఎన్నికల భద్రతకు ఒక పీడకల లాంటిదని..కొందరు డీప్ స్టేట్ సభ్యులు.. చైనా చేసిన ఈ డేటా మోసాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని అన్నారు. ప్రస్తుతం ఉన్న అమెరికా ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా, కచ్చితంగా లేదని, అది దారుణంగా విఫలమైందని విమర్శించారు. మోసం, జోక్యానికి ఆస్కారం లేని పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరముందంటున్నారు.
2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి పాలైన నాటి నుంచి ట్రంప్ ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే, 2020 ఎన్నికల ఫలితాలను మార్చగల స్థాయిలో మోసం జరిగిందని నిరూపించడంలో ట్రంప్, ఆయన మిత్రపక్షాలు వేసిన 60కి పైగా పిటిషన్లు విఫలమయ్యాయి. ఆయన సొంత న్యాయ విభాగం కూడా అటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.




Total views : 212603