తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు.
ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. పెరంబలూర్ జిల్లా మంగళమేడు సమీపంలో జరిగింది ఈ ఘటన. చెన్నై నుంచి మదురై వైపు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు..చెన్నై-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై..హైవే పక్కన బస్సును నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించేశాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సంతటా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. హైవేపై బస్సులో భారీగా మంటలు ఎగసిపడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు.





Total views : 219357