ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దశాబ్ద కాలంగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు సాకారం కావడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాల్లో భారీ మార్పులకు ఈ విమానాశ్రయం కేంద్ర బిందువుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఆలోచన 2014లో రూపుదిద్దుకుంది. విశాఖపట్నం విమానాశ్రయంపై పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రకు ప్రత్యేక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని నిర్ణయించారు. భూసేకరణ, అనుమతులు, నిర్మాణ పనులు పలు దశల్లో కొనసాగగా… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగం పుంజుకుని ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం… విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కీలక కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది. విమాన రాకపోకలు ప్రారంభమైన తర్వాత పెట్టుబడులు పెరగడంతో పాటు పరిశ్రమలు, ఐటీ, సేవా రంగ సంస్థలు ఉత్తరాంధ్ర వైపు మరింతగా ఆకర్షితమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
భోగాపురం విమానాశ్రయం కేవలం ఆధునిక మౌలిక వసతులకే పరిమితం కాకుండా… ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర కళలు, హస్తకళలు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ను తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు.ఆగస్టు 1న జరిగే ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజలు గర్వపడేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. విద్యార్థులు, యువత, ప్రజల భాగస్వామ్యంతో ఈ వేడుకను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆకాంక్షించారు.




Total views : 221094