బొల్లారం మిలటరీ కంపౌండ్ మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి మిస్సింగ్ అయిన గన్స్ చోరీ వెనకాల 12 ఏళ్ల పాటు మిలటరీలో పని చేసి బయటికి వచ్చిన ఓ ఉద్యోగి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసు మిస్టరీని చేధించేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్తో పాటు దేశంలోని అన్ని దర్యాప్తు ఏజెన్సీలు ఒక టీంగా పని చేశారు. దీనికి హైదరాబాద్ నగరం చుట్టూ 20 కిలో మీటర్ల వరకు జల్లెడ పట్టారు. కొన్ని వందల మందిని ఫాలో అయ్యారు. చివరకు లభించిన ఓ చిన్న క్లూతో తీగ లాగితే మొత్తం డొంక కదిలిందని సమాచారం.
అయితే ఈ మిస్సింగ్ గన్స్ వెనకాల పెద్ద కుట్ర ఉండొచ్చని అనుమానాలు ఉన్నప్పటికీ వాటిని నిర్ధారించుకునేందుకు ఇంకా అనేక ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. హంటింగ్ కోసం ఈ తుపాకులను చోరీ చేసినట్లుగా పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులు సమాధానం ఇచ్చి దర్యాప్తు దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అయితే ఈ మిస్సింగ్ మిలటరీ గన్స్ వెనకాల హానిట్రాప్, కోట్లాది డబ్బు లావాదేవీలు, ఉగ్ర ప్లాన్ వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా అనేక ట్విస్టులు వెలుగులోకి రానున్నాయని పోలీసులు అధికారులు వివరిస్తున్నారు. మిస్సింగ్ అయిన తుపాకులు అన్ని దొరకడంతో ఓ పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు, మిలటరీ అధికారులు ఊపీరి పీల్చుకుంటున్నారు. మిలటరీ క్యాంపులోని అత్యంత భద్రత వలయం నుంచి ఈ తుపాకులు బయటికి రావడంపై అక్కడ నెలకొన్న లోపాలపై కూడా పోలీసులు ఓ నివేదికను రూపొందించారు.