పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త వింత చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లకు ఓ అందమైన భామ చేతులు జోడించి స్వాగతం పలుకుతోంది. అయితే ఆమె మనిషి కాదు.. ఒక హ్యూమనాయిడ్ రోబో.. సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న ఈ నీల రోబో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లను భాగస్వాములను చేసేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. హ్యూమనాయిడ్ రోబో పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు వేయడానికి వస్తున్న వారికి చేతులు జోడించి నమస్కరిస్తూ.. వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
కేవలం నమస్కరించడమే కాదు.. ఓటు వేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.. మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోండి అంటూ స్ఫూర్తిదాయక సందేశాలు ఇస్తోంది నీల. ఈ వినూత్న స్వాగతాన్ని చూసి ఓటర్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు ఈ రోబోతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సాధారణంగా పోలింగ్ కేంద్రం అంటే సీరియస్ వాతావరణం ఉంటుంది. కానీ, ఈసారి ఓటర్లలో ఉత్సాహం నింపేందుకు, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచే భారీగా తరలివస్తున్న ఓటర్లు.. నీల రోబో ఇస్తున్న సందేశాలతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టెక్నాలజీని ప్రజాస్వామ్యంతో ముడిపెట్టిన ఈ తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.





Total views : 46184