మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కొడాలి నాని చంద్రబాబుతో పాటుగా అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం నుంచి చంద్రబాబును వెళ్లగొట్టాలని.. నిమ్మగడ్డ రమేష్కు దురుద్దేశాలు ఆపాదిస్తూ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని అప్పటి రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ కమిషనర్ కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక ఇచ్చారు. కొడాలి నానిపై 2021 ఫిబ్రవరి 16న స్థానిక న్యాయస్థానం అనుమతితో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
కొడాలి నాని మంత్రి పదవిలో ఉండటంతో ఈ కేసుపై కోర్టులో విచారణ చేయాలంటే ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసినా ఈ కేసు విచారణను కోర్టు స్వీకరించలేదు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్లో ఉండిపోయింది. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఈ కేసుకు సంబంధించి ప్రతిపాదనల్ని పంపారు. వీటిని ప్రభుత్వం పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించి నానిపై కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్కు అనుమతిచ్చింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాసిక్యూషన్కు అనుమతి రావడంతో కోర్టులో విచారణ ప్రారంభంకానుంది.
కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.
29
previous post






Total views : 149969