రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. బ్యాంక్ స్ట్రీట్లో కార్యాలయాల ఏర్పాటుకు 13 బ్యాంకులు ముందుకు రాగా, వాటిలో 11 సంస్థలు తమ భవన నిర్మాణ బాధ్యతలను సీపీడబ్ల్యూడీకి అప్పగించాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నిర్మాణాలను పూర్తి సమన్వయంతో వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఆర్డీఏ అధికారులకు సూచించారు.
రాజధానిలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ వంటి కనెక్టివిటీ సేవల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో డిజిటల్ వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమరావతిని కేవలం నిర్మించడమే కాకుండా, నివాస వ్యయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు, ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని ప్రోత్సహించడం, డిస్ట్రిక్ట్ కూలింగ్ వంటి ఆధునిక వ్యవస్థలను అందుబాటులోకి తేవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.రాజధాని సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వరకు ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా చూడటం ద్వారా పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉంటాయని అన్నారు. జల క్రీడలు, స్విమ్మింగ్ వంటి కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చని తెలిపారు.
రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
35
previous post






Total views : 151372