అంతర్జాతీయ వేదికగా భారత్ను నిందించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ మరోసారి భంగపడింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో జమ్మూకశ్మీర్పై మాట్లాడిన దాయాదికి మన దేశం గట్టిగా బుద్ధి చెప్పింది. స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక శక్తులను పెంచి పోషించిన పాకిస్థాన్… ఇప్పుడు వాటి కాటుకే బలవుతోందని దుయ్యబట్టింది. ఈసందర్భంగా సింధూ జలాల ఒప్పందం రద్దును భారత్ ప్రస్తావించింది. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశం.. సద్భావన, స్నేహంతో కలిగే ప్రయోజనాలను పొందలేదని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఐక్యరాజ్యసమితిలోని భారత ప్రతినిధి అనుపమా సింగ్ ఘాటుగా స్పందించారు. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే అని స్పష్టం చేశారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉందంటే.. అది భారత భూభాగాలను పాక్ ఆక్రమించుకోవడమే అని… వాటిని తిరిగి ఇవ్వకపోవడమే అని చెప్పారు. ఈ భూభాగాల్లో కొన్ని దశాబ్దాలుగా సైనిక బలగాలు అక్రమాలు చేస్తున్నాయన్నారు. కనీస స్వేచ్ఛకు నోచుకోక అక్కడి ప్రజలు బుల్లెట్లు, క్రూరత్వాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల రావల్కోట్లో జరిగిన విషాదం.. పాక్ దారుణాలకు నిలువెత్తు సాక్ష్యమన్న ఆమె… ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారికి శిక్షణ ఇవ్వడాన్ని ఆ దేశ రక్షణ మంత్రి తమ ప్రభుత్వవిధానంగా చెబుతారని విమర్శించారు. అలాంటి దేశం.. ఇప్పుడు తాము ఉగ్రవాద బాధితులమని వాపోవడం హాస్యాస్పదమన్నారు.
భారత్ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.
10




Total views : 150595