దిగ్గజ షూటర్, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. తుదిశ్వాస విడిచారు. భారత్ స్టార్ షూటర్ మను బాకర్ ఈయన కోచింగ్లోనే రాటుదేలిన సంగతి విదితమే.
ISSF వరల్డ్ కప్లో భాగంగా ఇటీవల జర్మనీ నుంచి భారత్కు తిరిగివస్తుండగా రాణా అనారోగ్యానికి గురయ్యారు. విమానం దిగిన వెంటనే ఆయన్ను దిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది. ‘జర్మనీలో వరల్డ్కప్ సందర్భంగా జస్పాల్కు ఛాతినొప్పి, అసౌకర్యం కలిగాయి. ఎసిడిటీగా పొరబడి.. తన పనిలో నిమగ్నమయ్యాడు. అయితే భారత్కు వచ్చేటప్పుడు మళ్లీ అసౌకర్యానికి గురయ్యాడు. దాంతో ఆసుపత్రిలో చేరాడు’’ అంటూ జస్పాల్ సోదరుడు సుభాష్ వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్యాలు గెలిచిన మను బాకర్కు రాణా వ్యక్తిగత కోచ్గా వ్యవహరించారు. 2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన జస్పాల్.. గతంలో జాతీయ జూనియర్ కోచ్గా వ్యవహరించారు. అప్పుడే మను బాకర్, సౌరభ్ చౌదరి లాంటి ప్రతిభావంతులైన షూటర్లు వెలుగులోకి వచ్చారు. ఒలింపిక్స్ విజయాల అనంతరం ఆయన గత ఏడాది ఫిబ్రవరిలో జాతీయ కోచ్గా నియమితులయ్యారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హై పర్ఫార్మెన్స్ కోచ్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జస్పాల్ రాణా మృతిపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ‘‘ఆయన మరణం భారత క్రీడా ప్రపంచానికి తీరనిలోటు. షూటింగ్లో ఆయన సాధించిన విజయాలతో దేశానికి ఎంతో పేరు తీసుకువచ్చారు. యువ అథ్లెట్లను తీర్చిదిద్దడంలో ఆయన చూపిన నిబద్ధత ఎనలేనిది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.
42
previous post



Total views : 141758