ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన సుబ్బారావు… వారికి తాత్కాలిక నివాసం కల్పించి తన సరుగుడు, సుబాబుల్, జామాయిల్ తోటల్లో పనులు చేయిస్తున్నాడు.
అయితే వారిని నిర్బంధించి బలవంతంగా పనులు చేయించుకుంటూ, తగిన కూలి చెల్లించకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. ఇదే సమయంలో ఓ గిరిజన మహిళపై సుబ్బారావు అత్యాచారానికి పాల్పడ్డాడని, దీనిని ప్రశ్నించిన ఆమె భర్తపై దాడి చేశాడని బాధిత కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థల ద్వారా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారికి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై స్పందించిన జేసీ కల్పనా కుమారి సంబంధిత అధికారులతో కలిసి తొర్రగుడిపాడు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధిత మహిళను స్వయంగా విచారించగా, తనపై అత్యాచారం జరిగినట్లు ఆమె వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఇతర గిరిజన కుటుంబ సభ్యులు కూడా తమతో బలవంతంగా పనులు చేయించుకుంటున్నట్లు జేసీ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో నిందితుడు బత్తుల సుబ్బారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేశారు. నాలుగు కుటుంబాలకు చెందిన 18 మంది గిరిజనులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.



Total views : 141756