తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్లాండ్లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. వనస్థలిపురంలోని వైదేహినగర్కి చెందిన మణిదీప్ రెడ్డి… ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లాడు. అక్కడ లాతి పట్టణంలోని LUT యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 4న తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్… మే 5వ తేదీ నుంచి ఫోన్కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఫిన్లాండ్లోని స్నేహితులు, తెలిసిన వారిని రూమ్కు, కాలేజీకి పంపించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో అక్కడ అదృశ్యం కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు మణిదీప్ రెడ్డి ఆచూకీ తెలియలేదు. కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి సహాయం కోరారు. 45 రోజులు గడుస్తున్నా ఫిన్లాండ్ అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు చొరవ తీసుకొని తమ కుమారుడి ఆచూకీ కనుగొని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని మణిదీప్ రెడ్డి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఫిన్లాండ్లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.
30
previous post




Total views : 151799