Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana ఇవాల్టి నుంచి తెలంగాణలో బోనాల జాతర.

ఇవాల్టి నుంచి తెలంగాణలో బోనాల జాతర.

by CVR NEWS
ఇవాల్టి నుంచి తెలంగాణలో బోనాల జాతర

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనమెత్తుకొని ఆలయాలకు తరలివెళతారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబంబించే బోనాల ఉత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా షురూ కానున్నాయి. చరిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి అమ్మవారికి నిర్వహించే ప్రథమ పూజతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. ఇవాళ లంగర్‌హౌస్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ప్రభుత్వం తరపున జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.

ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర వేళ, ఆ జగన్మాత ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ప్రార్థించారు. బోనాల పండుగ భక్తి, శక్తి, ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొన్నారు. అమ్మవారిపై అచంచల విశ్వాసంతో సమర్పించే ప్రతి బోనం, ప్రతి ప్రార్థన ప్రజల జీవితాల్లో సిరిసంపదలు, సంతోషం, ధైర్యం, విజయాలను నింపాలని ఆకాంక్షించారు. జగదాంబ మహంకాళి అమ్మ వారి అనుగ్రహం సకల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని, ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవం అని సీఎం అభివర్ణించారు. జంట నగరాల పరిధిలో జరిగే బోనాల ఉత్సవాలు, తెలంగాణ గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం అని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయని సీఎం వెల్లడించారు. బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న సుమారు మూడు వేలకు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక బోనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లంగర్‌హౌస్ చౌరస్తాలో ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాల నుండి కోటపై తొట్టెల సమర్పణ పూర్తి అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040820
Total views : 211835

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: