తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్ వచ్చింది. ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలను రేపు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగియడంతో ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ఇంటర్ బోర్డు ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
Latest News
దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే…….
దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ సొమ్మును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సత్వరమే ఉత్తర్వులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాబోయే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం – కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అధికారుల వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో సమీక్షా సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు..
మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలను కొట్టిపారేస్తూనే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్ నేతలకు ఎదురైన పరిస్థితులను ఆయన గుర్తుచేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన చిట్చాట్లో సీఎం ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై నేను ప్రత్యేకంగా స్పందించను” అని పేర్కొన్నారు. కాంగ్రెస్లో సీనియర్లకు అవమానం జరుగుతోందని అంటున్న వారు, బీఆర్ఎస్ నుండి సీనియర్ నేతలు ఎందుకు బయటకు వచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
“ఒకప్పుడు పార్టీ కోసం పనిచేసిన ఆళ్ల నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి నేతలు బీఆర్ఎస్ను ఎందుకు వీడాల్సి వచ్చింది? అక్కడ వారికి జరిగిన అవమానం ఏంటో అందరికీ తెలుసు” అని సీఎం అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారో, ఆయనకు బీఆర్ఎస్లో దక్కిన గౌరవం ఎంతో కనిపిస్తూనే ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో సీనియర్లకు జరిగిన అవమానాలు గుర్తులేవా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడూ తన నేతలను గౌరవిస్తుందని, కానీ కొందరు కావాలని చేస్తున్న విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమై ఆస్పత్రిలో చికిత్స పొంతుతూ మృతి చెందిన సంఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.లాలాపేటలోని ఇంద్రనగర్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ యాదవ్ అనే వ్యక్తి గతంలో ఆదే ప్రాంతానికి చెందిన దిలీప్ ముదిరాజ్ అనే -వ్యక్తికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తాజాగా దిలీప్ కు ఫోన్ చేసి తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమంటూ బాలకృష్ణ అడిగాడు, మద్యం మత్తులో ఉన్న దిలీప్ అతడితో దురుసుగా మాట్లాడుతూ డబ్బులు తిరిగివ్వనని తేల్చి చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. దీంతో రాత్రి 10 గంటల సమయంలో దిలీప్ తన సోదరుడు సాయికుమార్ తో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లి డోర్ కొట్టారు. అతడు తలుపు తీసిన వెంటనే వీరి వెంట తెచ్చుకున్న కారంపొడి అతడి కళ్లలో కొట్టి, ఒంటిపై పెట్రోల్ పోశారు. నిప్పంటించే ప్రయత్నం చేస్తుండగా స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వచ్చి వారిని అడ్డుకొని దేహశుద్ది చేసి పంపించారు. అనంతరం, కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన బాలకృష్ణ కుమారుడు ఫణీంద్ర తన తండ్రిపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకున్నాడు. వెంటనే కొపంతో కర్ర పట్టుకొని ఫణీంద్ర, అతని బంధువైన రాకేష్ యాదవ్ కలిసి దిలీప్ ఇంటికి ఆవేశంగా పరుగులు తీశారు. మార్గం మధ్యలో దిలీప్, సాయికుమార్లను చూసిన వెంటనే ఫణీంద్ర, రాకేష్ వారిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఫణీంద్ర తన చేతిలో ఉన్న కర్రతో దిలీప్ తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో రక్తశ్రావమై అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దిలీప్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, దిలీప్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఫణీంద్ర, రాకేష్ యాదవ్ పై హత్య కేసు నమోదు చేశారు. అదే విధంగా బాలకృష్ణపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేసిన సాయికుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చెన్నైలో టీవీకే అధినేత విజయ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన “జన నాయగన్” సినిమా లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే సెన్సార్ సమస్యలతో సంక్రాంతి నుంచి వాయిదా పడిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆన్లైన్లో లీక్ కావడం నిర్మాతలకు పెద్ద షాక్గా మారింది. తన రాజకీయ సభల్లో సినిమా విడుదలను డీఎంకే అడ్డుకుందని ఆరోపిస్తూ వచ్చిన విజయ్కు ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ లీక్ ఘటనపై చిత్రబృందం, అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్..ఏఐసీసీ పట్టు కోల్పోయిందని జీవన్ రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు పీసీసీ ఏది చెబితే ముఖ్యమంత్రులు అది చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే ఏకపక్షంగా ‘రూలర్’లా వ్యవహరిస్తున్నారు” అని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసే ఒక విభాగంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ చేసే తప్పులకు చివరకు ఏఐసీసీని నిందించడం సరికాదు. పార్టీ మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోందన్నారు జీవన్ రెడ్డి
తెలంగాణ ప్రజల నాడి మారుతోందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత పాలనతో విసిగిపోయిన ప్రజలు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీ మార్పులు రావడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. సీనియర్ నేతగా కాంగ్రెస్లో దశాబ్దాల అనుభవం ఉన్న జీవన్ రెడ్డి, నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మన్యం జిల్లాలో గిరిజనుల జీవన పరిస్థితులు ఇంకా మారలేదు. జియ్యమ్మవలస మండలం పరిధిలోని చాపరాయిగూడ, బాపన్నగూడ, దీసరిగూడ గ్రామాల ప్రజలు ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆసుపత్రికి చేరుకోవడం పెద్ద సవాలుగా మారింది. డోలీ మోతలతోనే రోగులను రెండు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి వైద్యం అందక ప్రాణాలు సైతం ప్రమాదంలో పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరాలు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని గిరిజనులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఈ గ్రామాల్లో గర్భిణీలు, బాలింతలు పడుతున్న ఇబ్బందులు మరింత విషమంగా ఉన్నాయి. ప్రసవ సమయం దగ్గరపడితే ఆసుపత్రికి తీసుకెళ్లడం కుటుంబ సభ్యులకు పెద్ద పరీక్షగా మారుతోంది. రహదారి లేకపోవడంతో డోలీ మోతలే ఏకైక మార్గంగా మారాయి. పసిపిల్లలను అంగన్వాడి కేంద్రాలకు తీసుకెళ్లాలన్నా రెండు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉంది. పిటి మండ గ్రామం చేరుకునే వరకు చిన్నారులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఉన్నా, అవి అందుబాటులోకి రాకపోవడం వల్ల గిరిజనుల జీవితం ఇంతకంతకూ కష్టాల్లోకి జారిపోతోంది. మౌలిక వసతులు లేకపోవడం వారి రోజువారీ జీవితాన్ని మరింత క్లిష్టంగా మార్చుతోంది.
ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన గ్రామాల పరిస్థితుల్లో మార్పు కనిపించడంలేదు. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారింది. బోర్ వేయాలన్నా యంత్రాలు గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పేరుతో ఇచ్చే హామీలు మాటలకే పరిమితమవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి ఇంకా కలగానే మిగిలిపోయింది. కనీస సదుపాయాలు కూడా అందని ఈ మూడు గ్రామాల ప్రజలు ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తమ వైఖరిని కఠినతరం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్లతో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను కొత్త దశకు తీసుకెళ్తామని ఖమేనీ ప్రకటించారు. ప్రపంచ చమురు సరఫరాలో ఈ జలసంధి అత్యంత ప్రధానమైన మార్గం కావడంతో, ఇరాన్ పట్టు పెంచితే ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. యుద్ధం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు గానూ అమెరికా, ఇజ్రాయెల్ నుంచి నష్టపరిహారాన్ని ఖచ్చితంగా వసూలు చేస్తామని ఖమేని స్పష్టం చేశారు. దురాక్రమణదారులను ఊరికే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభంలో ఇరాన్ ప్రజలే అంతిమ విజేతలుగా నిలిచారని ఆయన అభివర్ణించారు. శాంతిని కోరుకుంటున్నప్పటికీ, తమ ప్రాథమిక హక్కులను వదులుకోబోమని తేల్చి చెప్పారు. చర్చల సమయంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు నిరంతరం నిరసనలు తెలుపుతూ హ్యూమన్ డిఫెన్స్ చెయిన్స్ గా ఏర్పడాలని మొజ్తబా ఖమేని పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కు చేరుకుంది. అగ్రనేతలంతా బెంగాల్ గడ్డపైనే మోహరించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి, అమిత్ షా సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో మహిళా ఓటర్లపై గురి పెట్టింది బీజేపీ. వారిని ఆకట్టుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. బెంగాల్లో బీజేపీని గెలిపిస్తే .. మహిళలకు ప్రతినెలా 3వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆరు నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రకటించింది.
వచ్చే ఐదేళ్లలో కోటి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. నిరుద్యోగ యువతకు , మహిళలకు నెలకు 3 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయడంతో పాటు .. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. గోవుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని .. చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి సమయం ఆసన్నమైంది. అక్షయ తృతీయ పర్వదినాన ఈ నెల 20న జరగనున్న చందనోత్సవానికి సింహగిరి ముస్తాబవుతోంది. లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. అడుగడుగునా నిఘా, పకడ్బందీ వసతులు కల్పిస్తున్నారు. సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేస్తూనే.. ప్రత్యేక దర్శనాల కోసం టిక్కెట్ల ధరలను ఖరారు చేశారు. 300, 1000 మరియు 1500 రూపాయల ధరలతో ప్రత్యేక క్యూ లైన్లను అందుబాటులోకి తెస్తున్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. మౌలిక వసతులు, వైద్య సేవలు మరియు నిరంతర రవాణా సౌకర్యాలను సిద్ధం చేశారు. రేపు జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో.. ఏర్పాట్లపై తుది మెరుగులు దిద్దనున్నారు. భక్తి పారవశ్యంలో మునిగిపోనున్న సింహగిరిపై మరిన్ని వివరాలు మా ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు.




Total views : 33620