హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేలా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం రూపొందించిన ‘ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని’ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మరియు నేత అజారుద్దీన్ కలిసి సచివాలయంలో ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పథకం కింద హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం టవర్ల రూపంలో ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఒక్కో టవర్లో 10 అంతస్తులు.. ప్రతి అంతస్తుకు 12 ఫ్లాట్లు ఉండేలా ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలో మొత్తంగా లక్ష ఫ్లాట్లను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ భూముల్లో ఈ టవర్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది. ఇందుకోసం చార్మినార్, బహదూర్ పురా, ముషీరాబాద్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో స్థలాలను ఇప్పటికే గుర్తించారు.పేదవాడి చిరు కోరిక సొంత ఇల్లు. ఇందిరమ్మ రాజ్యంలోనే ఇది సాకారం అవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా స్థలం ఉన్న వారికి 4.50 లక్షల ఇండ్లు ఇచ్చాం. ఆగస్టు నాటికి 2 లక్షల పైగా ఇండ్లు పూర్తి కాబోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరం వెలుపల 30 కిలోమీటర్ల దూరంలో ఇండ్లు కట్టడం వల్ల ఉపాధి లేక పేదలు అక్కడ ఉండలేకపోయారు. కానీ మేము క్యూర్ పరిధిలోనే, గజం రూ. 2 నుంచి 3 లక్షల విలువైన ప్రాంతాల్లో కూడా స్థలాలు సేకరించి ఇండ్లు కట్టిస్తున్నాం.
చివరి లబ్ధిదారుడి వరకు ఇల్లు అందేలా చూస్తామని, పేదలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధికి ఇబ్బంది లేకుండా ఈ గృహాలను అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన పేదలందరికీ ఈ ఇందిరమ్మ ఇండ్లు వరంలా మారబోతున్నాయి.



Total views : 221438