హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. తనతో పాటు శిక్షణ పొందుతున్న మహిళా ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించారన్న ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. మోతీనగర్లోని బంధువుల ఇంట్లో విషపూరిత పదార్థం సేవించిన ఉదయ్ కృష్ణారెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి… తనపై వచ్చిన ఆరోపణలు, ప్రచారాలన్నీ నిరాధారమని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, తన ఆత్మహత్యకు నలుగురు వ్యక్తులే కారణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్తో తనకు ఏడాది కాలంగా సంబంధం ఉందని ఉదయ్కృష్ణ లేఖలో తెలిపారు. ఆ మహిళకు వివాహమైన తర్వాత కూడా తమ మధ్య బంధం కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. సదరు మహిళ తనంతట తానే తన గదికి వచ్చిందని, వాట్సాప్ సందేశాల ద్వారా తలుపు తెరవాలని కోరేదని వెల్లడించారు. ఇటీవల ఈ నెల 9న కూడా తన గదికి వచ్చి బలవంతం చేసిందని లేఖలో రాసుకొచ్చారు.
ఇక లైంగిక ఆరోపణల నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై హైదరాబాద్ నేషనల్ అకాడమీ చర్యలు తీసుకుంది. కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఉదయ్ కృష్ణా రెడ్డిని ఎన్పీఏ నుంచి అధికారులు పంపించేశారు.




Total views : 221456