ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఫేమస్ మ్యూజిక్ లేబుల్ సరిగమ ఇండియా లిమిటెడ్ సంస్థతో జరుగుతున్న కాపీరైట్ వివాదంలో కీలక తీర్పునిచ్చింది. గతంలో ఇళయరాజాకు వ్యతిరేకంగా ఇచ్చిన మధ్యంతర స్టేను ఎత్తివేయడానికి నిరాకరించింది. ఇళయరాజా తాను సృష్టించిన ట్యూన్లపై మాత్రమే కాపీరైట్ హక్కులను కలిగి ఉంటారని, సినిమాల్లో ఉపయోగించిన పూర్తి సౌండ్ రికార్డింగ్స్పై ఆయనకు హక్కులు ఉండవని స్పష్టం చేసింది. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 14(A) ప్రకారం కేవలం సాహిత్యం మినహాయించిన ట్యూన్స్ వరకే ఇళయరాజాకు హక్కులు ఉంటాయని.. సినిమాల్లో ఉపయోగించిన పూర్తి సౌండ్ రికార్డింగులను ఆయన సొంతంగా వాడుకుంటే అది కాపీరైట్ ఉల్లంఘనే అవుతుందని తేల్చి చెప్పింది. దీంతో134 సినిమాల్లోని పాటలపై ఇళయరాజాకు ప్రస్తుతానికి ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టమైంది.
1976 నుంచి 2001 మధ్య కాలంలో విడుదలైన పలు చిత్రాల నిర్మాతలతో తాము అధికారికంగా ఒప్పందాలు చేసుకున్నామని సరిగమ పేర్కొంది. ఈ ఒప్పందాల ప్రకారం ఆయా సినిమాల్లోని పాటల పూర్తి సౌండ్ రికార్డింగ్స్, సంగీతం, సాహిత్య పరమైన కాపీరైట్ హక్కులు చట్టబద్ధంగా తమకే సొంతమని ఆ సంస్థ వాదిస్తోంది. అయితే సరిగమ సంస్థకు హక్కులున్న ఈ 134 సినిమాల పాటలను ఇళయరాజా తన సొంత ఆస్తులుగా పేర్కొంటూ ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో అప్లోడ్ చేశారు. దీంతో సరిగమ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు.. పూర్తి సౌండ్ రికార్డింగ్పై ఇళయ రాజాకు హక్కులు ఉండవని తీర్పునిచ్చింది.




Total views : 196354