ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలు వేగంగా క్షీణిస్తుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ‘రెడ్ జోన్’ లోకి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉందని IEA తెలిపింది. త్వరలోనే చమురు మార్కెట్లు తీవ్ర ప్రమాదకర స్థాయిలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ‘అంతర్జాతీయ ఇంధన సంస్థ’ చీఫ్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. లండన్లో నిర్వహించిన ప్రపంచ ఇంధన భద్రత ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధ వాతావరణం కారణంగా తలెత్తిన ఈ అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే.. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హర్ముజ్ జలసంధి’ని ఎలాంటి షరతులు లేకుండా, పూర్తిగా తిరిగి తెరవడమే ఏకైక పరిష్కార మార్గమని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ హర్మూజ్ జలసంధిని యథాతథంగా తెరవడంలో విఫలమైతే, పశ్చిమాసియా దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని, దీనివల్ల వివిధ దేశాల్లో చమురు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని బిరోల్ వివరించారు. ఈ ఇంధన సంక్షోభం ప్రారంభమైన కొత్తలో ప్రపంచ దేశాల వద్ద అవసరానికి మించి మిగులు చమురు నిల్వలు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా అవి వేగంగా కరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు, రాబోయే వేసవి కాలంలో ప్రయాణాలు విపరీతంగా పెరిగి ఇంధనానికి డిమాండ్ మరింత ఎక్కువ కానుందని, ఈ రెండు కారణాల వల్ల రాబోయే జులై లేదా ఆగస్టు నెలల నాటికి ప్రపంచ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే గండం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.






Total views : 82540