Friday, May 22, 2026
News Navigation
Friday, May 22, 2026
News Navigation

Breaking

Friday, May 22, 2026
Home Telangana ప్లాస్టిక్‌పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం..

ప్లాస్టిక్‌పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం..

by CVR NEWS
ప్లాస్టిక్‌పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం

ప్లాస్టిక్‌పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం.

నిజామాబాద్ జిల్లా పల్లెల్లో ఇప్పుడు ప్లాస్టిక్‌పై అసలైన యుద్ధం ప్రారంభమైంది. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, టీ కప్పులు గ్రామాల్లో కనిపించకుండా చేయాలని గ్రామ పంచాయతీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆలూరు మండలం మచ్చర్ల గ్రామం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, గ్రామోత్సవాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించారు. ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం పెట్టినా, ప్లాస్టిక్ గ్లాసుల్లో నీళ్లు అందించినా జరిమానాలు విధిస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. గ్రామంలో హోటళ్లకు కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై టీ, కాఫీ స్టీల్ గ్లాసుల్లోనే అందించాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు పెరుగుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు ఇతర గ్రామాలకు సైతం ఆదర్శంగా మారుతున్నాయి. పల్లెల్లో మొదలైన ఈ పోరాటం భవిష్యత్తులో పెద్ద ఉద్యమంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం చూపిస్తూ నిజామాబాద్ పల్లెలు స్టీల్ బ్యాంకుల ఏర్పాటు వైపు అడుగులు వేస్తున్నాయి. మచ్చర్ల గ్రామంలో గ్రామస్థులే ముందుకొచ్చి 500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామాగ్రి కొనుగోలు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ మహిళా సంఘాలకు అప్పగించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, చిన్నపాటి వేడుకలకు ఈ సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. దీంతో ఒక్క గ్రామంలోనే వేల సంఖ్యలో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం తగ్గినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఫంక్షన్లలో ఒక్కరోజులోనే భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతాయి. వాటిని కాల్చడం వల్ల గాలి కాలుష్యం, భూమి కాలుష్యం పెరుగుతోంది . ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. గ్రామ ప్రజలు కూడా పంచాయతీ నిర్ణయాలకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెరుగుతుండటం విశేషం. ఇప్పుడు ఈ స్టీల్ బ్యాంక్ మోడల్ జిల్లాలోని మరిన్ని గ్రామాలకు విస్తరిస్తోంది.

నిజామాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ నిషేధం కేవలం మాటల్లోనే కాదు.. అమలులో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు . నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని గ్రామ పంచాయతీలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు ప్లాస్టిక్ వాడుతున్న వారి సమాచారం ఇచ్చేవారికి వెయ్యి రూపాయల బహుమతి ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల సహకారంతోనే ప్లాస్టిక్ నియంత్రణ సాధ్యమని గ్రామస్థులు భావిస్తున్నారు. ఇప్పటికే పిప్పి, చెంగల్, భీంగల్, మెండోరా సహా దాదాపు 20 గ్రామాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం అమలవుతోంది. మరికొన్ని గ్రామాలు కూడా తీర్మానాలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాలు, టీ హోటళ్లలో ఎక్కువగా ప్లాస్టిక్ గ్లాసులు వాడుతుండటంతో వాటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. అధికారులు, గ్రామాభివృద్ధి కమిటీలు, మహిళా సంఘాలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ క్రమంలో పల్లెల్లో మొదలైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు.

సిద్ధిపేటలో ప్రారంభమైన స్టీల్ బ్యాంక్ ఆలోచన ఇప్పుడు నిజామాబాద్ పల్లెల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతోంది. ప్లాస్టిక్ రహిత గ్రామాల లక్ష్యంతో గ్రామ పంచాయతీలు వరుసగా తీర్మానాలు చేస్తుండటం విశేషం. ఒకప్పుడు ఫంక్షన్లు అంటే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు తప్పనిసరిగా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామస్థులే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళా సంఘాలు ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు నేలలో కలవకపోవడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే గ్రామస్థులు ముందస్తు జాగ్రత్తగా ప్లాస్టిక్‌ను పూర్తిగా దూరం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం కూడా గ్రామాల్లో స్టీల్ బ్యాంకుల ఏర్పాటుకు సహకారం అందించాలని ప్రజలు కోరుతున్నారు. పల్లెల్లో మొదలైన ఈ ఉద్యమం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

015623
Total views : 82540

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.