హీరాగోల్డ్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. గత కొద్దిరోజులుగా దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి అజ్ఞాతంలో ఉంటున్న ఆమెను హర్యానాలోని గుర్గావ్లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత చట్టానికి దొరక్కుండా పరారయ్యారు నౌహీరా షేక్. గుర్గావ్లోని ఓ అద్దె నివాసంలో ఆమె నకిలీ పేరుతో, ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డు, ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి మారువేషంలో తలదాచుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. హ్యూమన్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిఘా పెట్టిన ఈడీ హైదరాబాద్ జోనల్ బృందం.. ఇవాళ ఉదయం ఆమె ఉన్న లొకేషన్ను గుర్తించి అదుపులోకి తీసుకుంది. గుర్గావ్లో అరెస్ట్ చేసిన అనంతరం నౌహీరా షేక్ను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత బేగంపేట కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించనున్నారు. కాగా, నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించినందుకు గానూ గుర్గావ్ పోలీసుల చేత ఆమెపై విడిగా మరో ఫోర్జరీ కేసు నమోదు చేయించేందుకు కూడా ఈడీ సిద్ధమవుతోంది.
హీరా గ్రూప్ సంస్థల పేరిట ఏడాదికి 36 శాతం చొప్పున భారీ లాభాలు ఇస్తామని నమ్మించి దాదాపు 5 వేల 978 కోట్లు వసూలు చేసి మోసగించినట్లు నౌహీరా షేక్పై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈడీ ఈ కేసులోPMLA కింద హీరా గ్రూప్కు చెందిన 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది.





Total views : 82539