సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ కొమురవెళ్లి మల్లన్న స్వామి ఆలయం ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆధ్యాత్మిక క్షేత్రం. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. భక్తుల రవాణా సౌకర్యాల కోసం కొత్తపల్లి–మనోహరబాద్ రైల్వే లైన్లో భాగంగా సుమారు 3 కోట్ల రూపాయలతో కొమురవెల్లి సమీపంలో హల్ట్ స్టేషన్ నిర్మించారు. షెల్టర్, హై లెవల్ ప్లాట్ఫామ్, వెయిటింగ్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు, టికెట్ కౌంటర్ వంటి అన్ని వసతులు సిద్ధమైనప్పటికీ స్టేషన్ ప్రారంభం మాత్రం ఇంకా జరగలేదు. ప్రస్తుతం భక్తులు బస్సులు, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. రైల్వే హాల్ట్ ప్రారంభమైతే భక్తులకు ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. కానీ నిర్మాణం పూర్తై నెలలు గడిచినా ప్రారంభం లేకపోవడం భక్తుల్లో నిరాశను కలిగిస్తోంది.
గత సంవత్సరం ఫిబ్రవరి 15న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ చేతుల మీదుగా కొమురవెల్లి రైల్వే హల్ట్ స్టేషన్కు శంకుస్థాపన జరిగింది. అనంతరం వేగంగా పనులు పూర్తయ్యాయి. దసరా పండుగ రోజున స్టేషన్ ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా పరిశీలించి త్వరలో ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రతి సంవత్సరం 25 లక్షల మందికి పైగా భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వస్తుండగా, రైల్వే స్టేషన్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ హల్ట్ స్టేషన్ ప్రారంభమైతే భక్తులకు మాత్రమే కాకుండా స్థానిక వ్యాపారులకు, యువతకు ఉపాధి అవకాశాలకు కూడా ఊతం లభిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు వెంటనే స్పందించి స్టేషన్ను ప్రారంభించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.




Total views : 54911