నమస్తే..వెల్కంటు పంచతంత్రం..
దేశ రాజకీయాల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోదీ అన్నట్లుగా సాగుతున్న ఈ ఎన్నికల సమరం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ముగిశాయి. బెంగాల్ మొదటి విడతలో రికార్డ్ స్థాయి పోలింగ్ నమోంది. అటు తమిళనాడులోనూ పోలింగ్ శాతంలో పాత రికార్డులు బద్ధలయ్యాయి. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఈసారి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట ట్రయాంగిల్ వార్ జరుగుతోంది. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేస్తామని కుండబద్దలు కొడుతోంది. ముఖ్యంగా బెంగాల్లో కాషాయ జెండా ఎగరేసి తీరుతామని కమలనాథులు చెప్తున్నారు. ఆ వివారాలు ఇవాళ్టి పంచతంత్రంలో చూద్దాం..
మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలకు దాక్కోవడానికి బెంగాల్లో ఎక్కడా చోటు దొరకదని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ తొలి దశ పోలింగ్లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారని, ఇది ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ ఓటింగ్ శాతాన్ని చూసి టీఎంసీకి భయం పట్టుకుందని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ను బయటకు తీస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రం విప్లవాల గడ్డ అని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ గూండాలను ఎవరూ కాపాడలేరని అన్నారు. మమతా బెనర్జీ సాగిస్తున్న అటవిక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ను బయటకు తీస్తామని మోదీ హెచ్చరించారు. మొదటి దశలో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదు కావడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బెంగాల్లో మహిళలకు గౌరవం, భద్రత, సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మొదటి దశలో 152 స్థానాలకు పోలింగ్ జరిగిందని, ఇందులో 110కి పైగా స్థానాలను తాము గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొదటి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందని, ఇది మోదీ నాయకత్వంలోని అభివృద్ధికి వేసిన ఓటు అన్నారు. బెంగాల్లోనే పుట్టి, బెంగాలీలో చదువుకుని, ఆ భాషను మాట్లాడగలిగేవారే బెంగాల్ తర్వాత ముఖ్యమంత్రిగా అవుతారని అన్నారు. కానీ ఆ అవకాశం మమతా బెనర్జీ మేనల్లుడికి రాదని, బీజేపీ కార్యకర్తకు వస్తుందని అన్నారు.
బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే సరిహద్దులను పూర్తిగా మూసివేస్తామని, ఒక్క చొరబాటుదారుడు కూడా లోపలికి రాకుండా అడ్డుకుంటామని అమిత్షా హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న అక్రమ వలసదారులను ఏరివేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీ అధికారంలోకి వస్తే.. పశ్చిమ బెంగాల్లో భయానక పాలనను అంతం చేస్తామని అమిత్షా పేర్కొన్నారు. చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మార్పు అంటే.. చొరబాటు రహిత బెంగాల్గా మార్చడమేనన్నారు. అవినీతి, బుజ్జగింపులు, దోపిడీల నుంచి స్వేచ్ఛ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.