పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో వాయిదా పడిన ఆయన సభలకు తాజాగా మార్గం సుగమమైంది. ఈ రోజు కోల్కతా, సెరంపూర్లలో రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నెల 23న కోల్కతా, సెరంపూర్లలో రాహుల్ గాంధీ ర్యాలీలు జరగాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో అవి రద్దయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడి వల్లే తమ సభలకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పరిణామంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత పెరిగింది.
అయితే, ఈ వివాదం సద్దుమణిగి అధికారులు అనుమతులు మంజూరు చేయడంతో ఇవాళ మళ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు కోల్కతాలోని చారిత్రక షహీద్ మినార్ మైదానంలో, ఆ తర్వాత హుగ్లీ జిల్లాలోని సెరంపూర్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇటీవల తృణమూల్, బీజేపీలపై రాహుల్ గాంధీ విమర్శల దాడి పెంచారు. మమతా బెనర్జీ స్వచ్ఛమైన పాలన అందించి, బెంగాల్ను విభజించకుండా ఉండుంటే, బీజేపీ ఇక్కడికి వచ్చేందుకు ఆస్కారమే ఉండేది కాదని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న తొలి విడత పోలింగ్ ముగియగా, ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది.