ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఆలయం తెరిచిన మొదటి మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రారంభ రోజుల్లో భక్తుల్లో భారీ ఉత్సాహం కనిపించిందని.. అధికారిక గణాంకాల ప్రకారం తొలి రోజైన ఏప్రిల్ 22న అత్యధికంగా 38 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని రుద్రప్రయాగ్ ఎస్పీ నిహారికా తోమర్ తెలిపారు. రెండో రోజు 25 వేల మందికి పైగా, మూడో రోజు మరో 30 వేల మందికి పైగా యాత్రికులు కేదార్నాథ్ చేరుకున్నారని ఎస్పీ అన్నారు. భక్తుల భారీ తాకిడి నేపథ్యంలో ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. జనసందోహాన్ని నియంత్రించేందుకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారని.. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఫైర్ సర్వీస్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని ఎస్పీ నిహారిక తెలిపారు.
జిల్లా మేజిస్ట్రేట్ విశాల్ మిశ్రా, ఎస్పీ నిహారికా తోమర్తో కలిసి ఆలయ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా యాత్రికులకు వారు కీలక సూచనలు చేశారు. ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం కోసం కేవలం పోలీసులు, జిల్లా యంత్రాంగం తాలూకు అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారాన్ని నమ్మి ఇబ్బందులు పడొద్దని సూచించారు.





Total views : 81456