తమిళ చిత్ర పరిశ్రమ చారిత్రాత్మక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. మే 2వ తేదీ నుంచి తమిళనాడులో సినిమా షూటింగ్లను నిరవధికంగా నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. కేవలం షూటింగ్ల నిలిపివేత మాత్రమే కాకుండా, సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను అమలులోకి తెస్తున్నారు. ఈ నిర్ణయం కోలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది.
ఈ కొత్త సంస్కరణల్లో ప్రధానమైనది నటీనటుల రెమ్యునరేషన్. ఇకపై నటీనటులకు సినిమా ప్రారంభంలోనే భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చే పద్ధతికి స్వస్తి పలకాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీనికి బదులుగా టాలీవుడ్లోని కొన్ని నిర్మాణ సంస్థలు అనుసరిస్తున్నట్లుగా, సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో రెవెన్యూ షేరింగ్ ఇచ్చే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనివల్ల నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా నటీనటులకు కూడా సినిమా విజయం పట్ల మరింత బాధ్యత పెరుగుతుందని భావిస్తున్నారు.
సినిమా బడ్జెట్లు అదుపు తప్పుతున్న వేళ, చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ఈ విప్లవాత్మక మార్పులు అనివార్యమని నిర్మాతల మండలి స్పష్టం చేస్తోంది. కేవలం పారితోషికాల విషయంలోనే కాకుండా, థియేట్రికల్, ఓటీటీ ఒప్పందాల విషయంలో కూడా పారదర్శకత కోరుతూ కీలక మార్పులు చేయబోతున్నారు. టాలీవుడ్ తరహాలో స్ట్రీమింగ్ నిబంధనలను కఠినతరం చేస్తూ పరిశ్రమను కాపాడుకునేందుకు ఈ ‘మే 2’ డెడ్లైన్ అత్యంత కీలకంగా మారనుంది.




Total views : 56592