అమెరికా అధ్యక్షడు ట్రంప్పై హత్యాయత్నం కలకలం రేపింది. వైట్హౌస్ ప్రెస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. సుమారు 5 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వైట్హౌస్ ప్రెస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగం కోసం అందరూ ఎదురుచూస్తున్న వేళ, కోల్ అలెన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. అతని వద్ద షాట్గన్, హ్యాండ్గన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కాల్పుల శబ్దంతో వందలాది మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, వేదికపై ఉన్న డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్లను సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. ట్రంప్ను భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో ఆయన అదుపుతప్పి కిందపడిపోయారు. ఆయన కిందపడిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను సైతం భద్రతా సిబ్బంది పట్టుకుని లాక్కెళ్లారు. ఈ దాడిలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్కు బుల్లెట్ తగిలింది. అయితే, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించి ఉండటంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం నిందితుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్, తామంతా సురక్షితంగా ఉన్నామని తెలిపారు. ఒక భద్రతా అధికారికి గాయాలయ్యాయని, బుల్లెట్ప్రూఫ్ వెస్ట్ కారణంగా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని సిక్ పర్సన్ అని ఆయన అభివర్ణించారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని చంపడానికి కూడా వారు తెగించారు అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్, సీనియర్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో జరిగిన దాడి ప్రమాదకరమైన ధోరణికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా వైట్హౌజ్ సమీపంలో జరిగిన హత్యాయత్నాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశాల్లో హింసకు ఏమాత్రం చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. వైట్హౌజ్ సమీపంలోని ఒక హోటల్లో ‘కరస్పాండెంట్స్ డిన్నర్’ కార్యక్రమం జరుగుతుండగా గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “నా మిత్రుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఈ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా ఆలోచనలు, ప్రార్థనలు ఆయన కుటుంబంతో, అమెరికా ప్రజలతో ఉన్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు.





Total views : 56519