పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితపేటలో ఉన్న పురాతన రామాలయం కూల్చివేతపై తీవ్ర వివాదం చెలరేగింది. అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బందోబస్తులో ఆలయాన్ని కూల్చివేసిన ఘటన సంచలనంగా మారింది. ఆకివీడు దళితపేటలో సంవత్సరాల చరిత్ర ఉన్న రామాలయం స్థలంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ…అధికారులు చర్యలకు దిగారు. ముందుగా దళితపేటలో కరెంట్ నిలిపివేసారని… దళితులు బయటకు రాకుండా ప్రతి ఇంటి వద్ద పోలీసులను మోహరించారని స్థానికులు చెబుతున్నారు. అనంతరం అధికారులు భారీ యంత్రాలతో రామాలయాన్ని కూల్చివేశాని చెబుతున్నారు. ఆలయాన్ని కూల్చివేసిన వెంటనే… అదే ప్రదేశంలో కొత్త ఆలయ నిర్మాణానికి అధికారులు శంకుస్థాపన చేసినట్లు సమాచారం. ఈ చర్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్ట్ స్టే ఉన్నా ఎందుకు కూల్చారు?”, “రాత్రివేళల్లో ఇలా చేయడం ఎందుకు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. తమను ఇళ్లలోనే నిలిపివేసి… హక్కులను కాలరాస్తున్నారని దళితపేట వాసులు ఆరోపిస్తున్నారు. దళితపేట సమీప ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపులో ఉంచేందుకు పహారా కొనసాగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన రాజకీయ పార్టీల నేతలు… కోర్ట్ ఆదేశాలను అతిక్రమించారని ఆరోపిస్తూ… ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఆకివీడు దళితపేటలో రామాలయం కూల్చివేత ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దళితపేటలో ఉన్న పురాతన రామాలయం కూల్చివేతపై తీవ్ర వివాదం..
14




Total views : 56636