ఇది మరో ఆత్మ కథ ..సినిమాలో చూపిస్తున్నట్లు ఆత్మలు ఉన్నాయా ? ఉంటే ఎలా ఉంటాయి ? మరొకరిలోకి ప్రవేశిస్తుందా ? ప్రస్తుత ఏఐ యుగంలో ఆత్మలు అంటూ భ్రమపడితే నమ్మే వాళ్ళు ఉంటారా ? మూఢనమ్మకాలను ఇంకా నమ్మేదెవరు ? ఇలాంటి సంఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం ఎంసీపల్లి గ్రామంలో జరిగింది .ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆరు నెలల క్రితం తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని బాధతో 18 ఏళ్ల హేమ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై హేమ ఆత్మ ఆవహించిందని గ్రామస్తులు నమ్ముతున్నారు. బాలిక అసహజ ప్రవర్తనతో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తుండగా, ఆమె తల్లిదండ్రులు భూత వైద్యుడిని ఆశ్రయించారు. అంకాలమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాలికలో మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. పూజల సమయంలో బాలిక ఒక్కసారిగా ఆగ్రహంతో ప్రవర్తిస్తూ అక్కడున్న వారిపై దూసుకెళ్లడం కలవరపరిచింది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సివిఆర్ రిపోర్టర్పై కూడా ఆమె దాడి చేయడం సంచలనంగా మారింది. ఇది నిజంగా ఆత్మ ఆవహించిందా లేక మానసిక సమస్యలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు భయంతో పాటు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
పుంగనూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దింతో హేమ ఆత్మ గ్రామంలో తిరుగుతోందని ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో ఒక మైనర్ బాలిక ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు రావడంతో గ్రామస్తులు దీనిని ఆత్మ ప్రభావంగా భావిస్తున్నారు. బాలిక తనలో మరో వ్యక్తి ఉన్నట్లు మాట్లాడడం, ఆగ్రహావేశాలకు లోనవడం, తనకు తెలియని విషయాలు చెప్పడం వంటి ఘటనలు బాలిక కుటుంబాన్ని ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో భూత వైద్యుడిని సంప్రదించగా, అంకాలమ్మ పూజల సమయంలో బాలిక తీవ్రంగా ప్రతిస్పందించింది. అక్కడున్న వారిని బెదిరిస్తూ, రిపోర్టర్పై దాడి చేయడం మరింత కలవరపరిచింది. అయితే నిపుణులు మాత్రం ఇలాంటి ఘటనలను మానసిక ఆరోగ్య సమస్యల కోణంలో చూడాలని సూచిస్తున్నారు. మూఢనమ్మకాలకంటే వైద్య చికిత్స అవసరమని అభిప్రాయపడుతున్నారు. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా మూఢ నమ్మకాలను పాటించే జనం ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . ఏదిఏమైనా ఈ ఘటన స్థానికంగా భయంతో పాటు ఆసక్తి నీ కూడా రేకెత్తిస్తోంది.






Total views : 75195