తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. TVK ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఈ బలపరీక్ష విజయ్ ప్రభుత్వ భవిష్యత్తునే కాకుండా, ఒకప్పుడు తమిళ రాజకీయాలను శాసించిన అన్నాడీఎంకే పార్టీ మనుగడను కూడా నిర్దేశించనుంది. పార్టీలో మొదలైన తిరుగుబాటుతో అన్నాడీఎంకే చీలిక అంచున నిలిచింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను, విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్కు 10అడుగుల దూరంలో నిలిచింది. దీంతో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, IUML మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ కూటమితో ప్రభుత్వానికి ఢోకా లేనప్పటికీ, అనూహ్యంగా అన్నాడీఎంకేలోని రెబల్ వర్గం నుంచి విజయ్కు మద్దతు లభించింది. సీనియర్ నేతలు షణ్ముగం, వేలుమణి నేతృత్వంలోని రెబల్ వర్గం తమకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించింది. విజయ్ స్వయంగా షణ్ముగం నివాసానికి వెళ్లి మద్దతు కోరగా వారు అంగీకారం తెలిపారు. అయితే, మరోవైపు అన్నాడీఎంకే అధికారిక నాయకత్వం, ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వర్గం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ 47 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. విప్ను ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం, ఒక పార్టీ చీలికగా గుర్తింపు పొందాలంటే మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు ( అంటే..47 మందిలో 32 మంది) ఒకేతాటిపై ఉండాలి. రెబల్ వర్గం 32 మంది మద్దతును కూడగడితే, వారు అనర్హత వేటు నుంచి తప్పించుకుని, అన్నాడీఎంకే అధికారికంగా చీలిపోతుంది. దీంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుంది. లేనిపక్షంలో, రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వస్తుంది. జయలలిత మరణానంతరం నిరంతర సంక్షోభంలో ఉన్న అన్నాడీఎంకే భవిష్యత్తు ఇవాల్టి బలపరీక్షతో తేలిపోనుంది.






Total views : 74955