సినిమా ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు పెంచకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. ‘అంతరించిపోతున్న సినిమా హాళ్లని కాపాడండి’ అన్న నినాదంతో మంగళవారం ఎగ్జిబిటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగిల్ థియేటర్ల మనుగడ కోసమే పర్సంటేజీ విధానం అడుతుగుతున్నామన్నారు. ఈ విధానానికి నటులు, నిర్మాతలు సహకరించాలని కోరారు.
సాధారణంగా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తుంది. కానీ, ప్రభుత్వం అటువంటి జీఓలు ఇచ్చినా కూడా తాము మాత్రం ధరలను పెంచబోమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. సామాన్య ప్రేక్షకులకు ఇది ఒక రకమైన హామీ అని వారు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్లకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. మల్టీప్లెక్స్లకు వెళ్లలేని పేద, మధ్యతరగతి ప్రజలకు సినిమా వినోదాన్ని చేరువ చేయడమే దీని అసలు ఉద్దేశం. టికెట్ రేట్లు పెరిగితే సామాన్యుడు థియేటర్లకు రావడం మానేస్తాడని, అది వ్యవస్థకే ప్రమాదమని వారు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సింగిల్ స్క్రీన్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ థియేటర్లను గోడౌన్లకు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుందని ఎగ్జిబిటర్ నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సినిమా పట్ల ఉన్న మక్కువతోనే నష్టాలు వచ్చినా హాల్స్ నడుపుతున్నామని ఆయన వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నిర్మాతలే తమను ఆదుకోవాలని, పర్సంటేజీల విషయంలో వెనక్కి తగ్గాలని కోరారు. ఒక ఊరిలో థియేటర్ మూతబడితే ఆ ఊరిలో ఒక సాంస్కృతిక కేంద్రం అంతరించిపోయినట్లేనని వారు హెచ్చరించారు.






Total views : 74911