Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Andhra Pradesh చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?

చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?

by CVR NEWS
చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?

ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డంపింగ్ యార్డ్ ప్రస్తుతం ఆదాయ వనరుగా కాకుండా చెత్త కుప్పల కేంద్రంగా మారిపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానం పూర్తిగా అమలుకాకపోవడంతో యార్డు అంతా వ్యర్థాలతో నిండిపోయింది. కంపోస్టింగ్ యూనిట్లు, రీసైక్లింగ్ యంత్రాలు, కొబ్బరి బొండాల వ్యర్థాలను ఉపయోగకర ఉత్పత్తులుగా మార్చే మెషినరీ అన్నీ అక్కడ ఉన్నప్పటికీ అవి ధూళిపట్టే పరిస్థితి నెలకొంది. 2017లో భారీ ఆశయాలతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు మున్సిపాలిటీకి ఒక్క రూపాయి ఆదాయం కూడా తీసుకురాకపోవడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమై, పర్యవేక్షణను పూర్తిగా విస్మరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డుల నుంచి ప్రతి రోజు టన్నుల కొద్దీ చెత్త డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నప్పటికీ… దానిని శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేసి ఎరువుల తయారీ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటి కార్యక్రమాలు సమర్థంగా అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెత్తను వనరుగా మార్చి ఆదాయం ఆర్జించాల్సిన ప్రాజెక్టు… ఇప్పుడు నిర్వహణలోపంతో నిరుపయోగంగా మారిందని ప్రజలు అంటున్నారు. లక్షల రూపాయల విలువైన యంత్రాలు వినియోగం లేక పాడైపోతుండగా… కనీసం చెత్త కుప్పలను తొలగించేందుకు అవసరమైన జేసీబీ కూడా అందుబాటులో లేకపోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెబుతోంది. తగిన సాంకేతిక సిబ్బంది, కార్మికులు నియమిస్తే ఈ ప్రాజెక్టు మళ్లీ పునరుద్ధరించబడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో కీలకమైన కంపోస్టింగ్, రీసైక్లింగ్ వ్యవస్థలను సమర్థంగా అమలు చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం రావడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చని ప్రజలు చెబుతున్నారు. కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనం ప్రస్తుతం వృథాగా మారిందనే విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి.

చెత్తను సంపదగా మార్చాలనే దూరదృష్టితో ప్రారంభించిన చీరాల డంపింగ్ యార్డ్… నేడు పరిపాలనా వైఫల్యానికి ప్రతీకగా మారిందని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టు… సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని అంటున్నారు. తడి చెత్తతో కంపోస్టింగ్ చేస్తే ఎరువుల రూపంలో ఆదాయం వస్తుందని, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే రెవెన్యూ పెరుగుతుందని తెలిసినా… ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఒకప్పుడు స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిచిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే వెనుకబడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఈ డంపింగ్ యార్డ్‌ను బాపట్ల జిల్లాలోనే మోడల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు వచ్చి చెత్తను సంపదగా మార్చే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని… ప్రజాధనం వృథా కాకుండా చూడాలని చీరాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012437
Total views : 75164

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.