ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశీయంగా తయారు చేసిన సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ వ్యవస్థను ప్రైవేట్ రక్షణ సంస్థ నిబే లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఒడిశాలోని చాందీపుర్ పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో రూపొందించిన రెండు రకాల సూర్యాస్త్ర రాకెట్ నమూనాలను పరీక్షించారు. ఈ పరీక్షల్లో రాకెట్లు లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో తాకినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం 1.5 నుంచి 2 మీటర్ల పరిధిలోనే లక్ష్యాన్ని ఛేదించడం ఈ వ్యవస్థ ప్రత్యేకతగా పేర్కొన్నారు.
150 కిలోమీటర్ల శ్రేణి వేరియంట్ యుద్ధరంగంలో తక్షణ రక్షణ మద్దతుకు, శత్రు స్థావరాలపై వ్యూహాత్మక దాడులకు ఉపయోగపడుతుంది. ఇక300 కిలోమీటర్ల శ్రేణి వేరియంట్ సైన్యానికి స్టాండ్-ఆఫ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అంటే మన సైనికులు సురక్షిత ప్రాంతంలో ఉంటూనే, శత్రు సరిహద్దుల వెనుక చాలా లోతున ఉన్న వ్యూహాత్మక కేంద్రాలను ధ్వంసం చేయవచ్చు.
ఈ విజయవంతమైన ప్రయోగాలతో ఈ రాకెట్ వ్యవస్థ త్వరలోనే భారత సైన్యం అమ్ములపొదిలో అధికారికంగా చేరనుంది. గతంలో ఇటువంటి అధునాతన క్షిపణి, రాకెట్ వ్యవస్థల కోసం భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీని ప్రోత్సహిస్తుండటంతో, DRDO వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు నిబే లిమిటెడ్ వంటి ప్రైవేట్ రక్షణ సంస్థలు కూడా అత్యాధునిక ఆయుధాలను ఇక్కడే తయారు చేస్తున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశీయ రక్షణ రంగ పారిశ్రామిక ప్రగతికి, స్వయం సమృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.




Total views : 81759