Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్..

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్..

by CVR NEWS
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్

ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరోసారి హైదరాబాద్ పేరు మారుమోగుతోంది. అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తోంది. దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో రూపొందుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ 2026 మధ్య నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. షాద్‌నగర్, మేకగూడ ప్రాంతాల్లో విస్తరించిన ఈ డేటా సెంటర్ కేవలం తెలంగాణకే కాదు… దేశ టెక్నాలజీ భవిష్యత్తుకే గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది. ప్రపంచవ్యాప్తంగా AI సేవల డిమాండ్ పెరుగుతున్న వేళ… భారతదేశాన్ని AI హబ్‌గా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు వేసింది. ఈ డేటా సెంటర్ ద్వారా అజుర్ క్లౌడ్ ,కోపైలట్ వంటి అత్యాధునిక సేవలకు భారీ మౌలిక సదుపాయాలు లభించనున్నాయి. అంతర్జాతీయ స్థాయి డిజిటల్ మౌలిక వసతులతో హైదరాబాద్ మరోసారి గ్లోబల్ టెక్ మ్యాప్‌పై హాట్ టాపిక్‌గా మారుతోంది.

కృత్రిమ మేధస్సు యుగంలో డేటా సెంటర్ల ప్రాముఖ్యత ఎంత పెరిగిందో ప్రపంచం చూస్తోంది. అదే సమయంలో హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్ దేశ డిజిటల్ రంగానికి కొత్త దిశ చూపనుంది. అజుర్ క్లౌడ్ సేవలు, AI కంప్యూటింగ్, కోపైలట్ ఆధారిత స్మార్ట్ టెక్నాలజీలకు అవసరమైన సర్వర్లు, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థలు ఈ క్యాంపస్‌లో ఏర్పాటు కానున్నాయి. ముఖ్యంగా AI ఆధారిత సేవల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెంటర్ భారత మార్కెట్‌కు కీలక మద్దతు ఇవ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, అత్యుత్తమ కనెక్టివిటీ, మౌలిక వసతులు మైక్రోసాఫ్ట్‌ను ఆకర్షించాయి. ఈ ప్రాజెక్ట్‌తో హైదరాబాద్ కేవలం ఐటీ నగరంగా కాకుండా… దేశంలోనే అత్యంత శక్తివంతమైన AI , క్లౌడ్ టెక్నాలజీ కేంద్రంగా ఎదగబోతోంది.

హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న ఈ మెగా డేటా సెంటర్ ప్రభావం కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కానే కాదు. వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు సృష్టించబడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, విద్యుత్, నెట్‌వర్క్ మౌలిక వసతులు, సెక్యూరిటీ, టెక్నికల్ సపోర్ట్ రంగాలకు భారీ ఊతం లభించనుంది. ముఖ్యంగా షాద్‌నగర్, మేకగూడ ప్రాంతాలు భవిష్యత్తులో భారీ టెక్ కారిడార్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మైక్రొసాఫ్ట్ ఈ స్థాయి పెట్టుబడి పెట్టడం ద్వారా హైదరాబాద్‌పై ప్రపంచ టెక్ కంపెనీల విశ్వాసం మరింత బలపడింది. ఇప్పటికే గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజాలు తెలంగాణలో కార్యకలాపాలు విస్తరిస్తుండగా… ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్‌తో హైదరాబాద్ దేశ డిజిటల్ రాజధానిగా ఎదుగుతోందనే అభిప్రాయం బలపడుతోంది. AI భవిష్యత్తు కోసం భారత్ సిద్ధమవుతున్న సంకేతంగా ఈ ప్రాజెక్ట్‌ను విశ్లేషిస్తున్నారు నిపుణులు .

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: