రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన ఈ రైఫిళ్లకు తయారీ సంస్థ ‘షేర్’ అని నామకరణం చేసింది. రష్యా సహకారంతో ఏర్పాటైన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) వీటిని ఉత్పత్తి చేస్తోంది. సైన్యానికి చిన్న ఆయుధాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఇవి కీలకంగా మారనున్నాయి.
ఏకే-203 రైఫిళ్ల తయారీకి రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకుని.. అమేథీలో దేశీయ ఉత్పత్తి చేపడుతున్నారు. ఒప్పందం ప్రకారం 2032 వరకు సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ.. ఏడాది ముందుగానే, 2031 నాటికి మొత్తం రైఫిళ్ల సరఫరాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు IRRPL ఎండీ, సీఈఓ మేజర్ జనరల్ సుధీష్ కుమార్ శర్మ తెలిపారు. భారత ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ, రష్యాకు చెందిన కలాష్నికోవ్, రోసోబోరోన్ఎక్స్పోర్ట్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్ ద్వారా 6 లక్షలకు పైగా ఏకే-203 రైఫిళ్లను తయారు చేయనున్నారు.