భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్పై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. 22ఏ అవినీతిపై వచ్చే నెల 5, 6 తేదీల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతామని ప్రకటించారు.
రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే భూ కుంభకోణాలు, ఫీజు బకాయిల అంశాలపై బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.