తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు రోల్ సభలు నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సభల రూపంలో జరిగే ఈ కార్యక్రమాల్లో బూత్ స్థాయి అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను బహిరంగంగా చదివి వినిపించనున్నారు. అర్హులైన ఓటర్లు ఎవరైనా జాబితాలో లేకపోతే గుర్తించడంతో పాటు.. పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పించనున్నారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండే యువత ఫామ్-6 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. వివరాల్లో తప్పులు ఉన్నవారు ఫామ్-8 ద్వారా సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరోవైపు ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఒకే పేరు రెండు చోట్ల ఉండటం, కుటుంబ సభ్యుల వయసుల్లో వ్యత్యాసాలు, తండ్రి పేరు వంటి వివరాల్లో తప్పులు ఉండటం వంటి అంశాలపై ఈ నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు విచారణ సమయంలో ఎన్యుమరేషన్ ఫారంతో పాటు అవసరమైన గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు దాఖలు చేయవచ్చు. విచారణ ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగనుండగా.. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు 27న జరిగే ఓటరు రోల్ సభలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.