తెలంగాణ రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర రాకెట్ను ఎస్వోటీ ఎల్బీనగర్ జోన్ పోలీసులు ఛేదించారు. పక్కా సమాచారం మేరకు ఎస్వోటీ పోలీస్ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, హయత్నగర్ పోలీసులు.. పీఎస్ పరిధిలోని పెద్ద అంబర్పేట వద్ద ఈ రోజు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 600 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నుంచి తెలంగాణకు నిషేధిత బీటీ -3 పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ బృందం, వ్యవసాయ శాఖ అధికారులు, హయత్నగర్ పోలీసులు కలిసి పెద్ద అంబర్పేటలోని పిస్తా హౌస్ సమీపంలో ఔటర్ సర్వీస్రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా అక్కడక్కడే తిరుగుతున్న టాటా నెక్సాన్, మహీంద్రా బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా 10 గోనె సంచుల్లో సుమారు 600 కిలోల నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలు లభించాయి. వెంటనే నిందితులు చలివెందుల రాజారామ్, గోస స్వామి దాసు, అనుముల మల్లేశ్వరయ్య, కందాల చిన్న ఓబులేసును అదుపులోకి తీసుకుని విచారించిన వెంటనే అరెస్ట్ చేశారు. వీరు అధిక దిగుబడి వస్తుందని తెలంగాణ రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. నకిలీ సీడ్ గ్యాంగ్లో ప్రధాన నిందితుడైన రామ్మోహన్రెడ్డి పరారీలో ఉండగా, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నకిలీ విత్తనాల వల్ల మొలకలు సరిగా రాకపోవడం, పంట దిగుబడి తగ్గడం, రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలగడం జరుగుతుందని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు





Total views : 81751