Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News ఎల్ఈడీ లైట్లతో నరకప్రాయంగా రాత్రి ప్రయాణం..

ఎల్ఈడీ లైట్లతో నరకప్రాయంగా రాత్రి ప్రయాణం..

by CVR NEWS

రాత్రి వేళ రోడ్లపై ప్రయాణం ఇప్పుడు ప్రజలకు భయానక అనుభవంగా మారుతోంది. ఎదురుగా వచ్చే వాహనాల ఎల్ఈడీ హెడ్‌లైట్ల కాంతి డ్రైవర్ల కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హైవేలపై, గ్రామీణ రహదారులపై ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారింది. ఒక్కసారిగా కళ్ల ముందు తెల్లటి వెలుగు పడటంతో కొన్ని క్షణాలు ఏమీ కనిపించకపోవడం, అదే సమయంలో ప్రమాదాలు జరగడం సాధారణమవుతోంది. గతంలో హెడ్‌లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ తప్పనిసరి అన్న నిబంధన అమల్లో ఉండేది. ఇప్పుడు ఆ నిబంధన అమలులో ఉందో లేదో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. మరోవైపు కంపెనీ ఫిట్‌మెంట్ కాకుండా మార్కెట్‌లో దొరికే హై పవర్ LEDలు, ప్రొజెక్టర్ లైట్లు వాహనాలకు అమర్చడం పెరిగిపోయింది. ఆర్టీవో, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయకపోవడంతో నియంత్రణ పూర్తిగా సడలిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. రాత్రి 7 గంటల తర్వాత వాహనం నడపాలంటేనే భయమేస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారత మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం హెడ్‌లైట్ల వినియోగంపై ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. లో-బీమ్‌కు 55 వాట్స్, హై-బీమ్‌కు గరిష్టంగా 60 నుంచి 70 వాట్స్ వరకు మాత్రమే అనుమతి ఉంది. కానీ మార్కెట్‌లో 100 వాట్స్ పైగా కాంతి ఇచ్చే బల్బులు విస్తృతంగా అమ్ముడవుతున్నాయి. కంపెనీ ఇచ్చిన సాధారణ లైట్ల స్థానంలో అధిక కాంతి ఇచ్చే LEDలు అమర్చడం చట్టవిరుద్ధం అయినా ఎక్కడా నియంత్రణ కనిపించడం లేదు. సుప్రీంకోర్టు కూడా ఇతరులకు కళ్లు మిరుమిట్లు గొలిపే లైట్లు ప్రమాదకరమని స్పష్టం చేసింది. నగరాల్లో, స్ట్రీట్ లైట్లు ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా డిమ్ లైట్ వాడాలనే నిబంధన ఉన్నా చాలామంది డ్రైవర్లు హైబీమ్‌ను ఆఫ్ చేయడం లేదు. ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనదారులు క్షణాల్లో విజిబిలిటీ కోల్పోతున్నారు. ఇది చిన్న ప్రమాదాలకే కాదు ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి అక్రమ LEDలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డు భద్రతలో హెడ్‌లైట్ల నియంత్రణ అత్యంత కీలకమైన అంశంగా నిపుణులు చెబుతున్నారు. వాహనానికి గరిష్టంగా నాలుగు లైట్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉన్నా కొందరు అదనపు ఫాగ్ లైట్లు, LED బార్లు అమర్చి రోడ్లపై తిరుగుతున్నారు. తెలుపు లేదా పసుపు రంగు లైట్లు మాత్రమే అనుమతించబడినా బ్లూ, వైట్ ఫ్లాషింగ్ లైట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవి ఇతర డ్రైవర్ల దృష్టిని మరింత దెబ్బతీస్తున్నాయి. రాత్రి సమయంలో కొన్ని క్షణాల విజిబిలిటీ కోల్పోవడమే భారీ ప్రమాదాలకు కారణమవుతుందని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, కంటి సమస్యలు ఉన్నవారికి ఈ LED కాంతి మరింత ప్రమాదకరంగా మారుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానాలు, మళ్లీ తప్పు చేస్తే మరింత భారీ ఫైన్ విధించే అవకాశం ఉంది.నిబంధనలు అమలు చేయడంలో అధికారుల అలసత్వాన్ని కొందరు వాహన దారులు అవకాశంగా తీసుకుంటున్నారు .దింతో పరిస్థితి అదుపు తప్పుతోంది. కనీసం పాత నిబంధనల మాదిరిగా హెడ్‌లైట్లపై బ్లాక్ స్టిక్కర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని, అక్రమ LEDలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: