పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చిచంపారు. పుల్వామాకు చెందిన బుర్హాన్ ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో 2017లో పాకిస్థాన్కు వెళ్లాడు. తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్లో చేరి, కొద్ది కాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు. అతడిని 2022లో భారత్ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019, ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఉగ్రదాడి ఘటన వెనక పాకిస్థాన్ హస్తం గల ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉన్నట్లు భారత నిఘాసంస్థలు గుర్తించాయి. దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేపట్టింది. పాక్ భూభాగంలోని బాలాకోట్లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత పాక్ ప్రతీకార దాడులు చేపట్టింది. మన గగనతలంలోకి వారి యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. అయితే పాక్ చర్యను భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో మన మిగ్ విమానం ఒకటి కూలి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శత్రుచెరలో చిక్కుకుపోయారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడితో మూడు రోజుల తర్వాత అభినందన్ను పాక్ విడిచిపెట్టింది.




Total views : 81817