అమరావతిలో సైబర్ మరియు ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సైబర్ మోసాలకు తక్షణ స్పందన, బాధితులకు త్వరగా సహాయం అందించే విధానాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడి మోసాలు అత్యంత పెద్ద ఆర్థిక నేరాలుగా మారుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటి వరకు ఏపీలో సైబర్, ఆర్థిక నేరాల కారణంగా ప్రజలు రూ.652 కోట్లకు పైగా నష్టపోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి 1930 టోల్ఫ్రీ నంబర్కు మొత్తం 9.29 లక్షల కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు. సమీక్షలో ముఖ్యంగా “గోల్డెన్ అవర్” విధానం, ఏపీ సైబర్ పాలసీ, ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఫిషింగ్, విషింగ్, క్రెడిట్-డెబిట్ కార్డు మోసాలు, ఆన్లైన్ లోన్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలు భారీగా మోసపోతున్నారని అధికారులు వివరించారు. అయితే సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం బ్యాంకర్లతో కలిసి పనిచేయడం వల్ల రూ.116 కోట్లకు పైగా మొత్తాన్ని సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడకుండా కాపాడగలిగామని అధికారులు తెలిపారు. బ్యాంకులతో మరింత సమన్వయం పెంచుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Tag:





Total views : 75962