తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కొలువు తీరింది. విజయ్ కేబినెట్ లో ఏకైక.. యువ మహిళా మంత్రిగా కీర్తన సంపత్ ప్రమాణ స్వీకారం చేసారు. తన పార్టీ నుంచి ఎంతో మంది సామాన్యుల ను అసెంబ్లీకి పంపిన విజయ్.. కీర్తన విషయంలోనూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెడుతున్న కీర్తన సంపత్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతి కీర్తన సంపత్. కీర్తనది విరుద్ నగర్ జిల్లా చత్రరెడ్డియపట్టి. అక్కడే ఆమె డిగ్రీ వరకు చదువుకుంది. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసింది.ఆ తర్వాత డేటా అనలిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించారు. ప్రశాంత్ కిశోర్ బృందంలో చేరారు. గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల్లో తెరవెనుక వ్యూహరచనలో కీలక పాత్ర పోషించారు.
హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఆమె నాయకత్వం వహించారు. టీడీపి సోషల్ మీడియా లీడ్గా పనిచేసి తన పొలిటికల్ కన్సల్టెంట్కు ముగింపు పలికారు. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగు భాషపై మంచి పట్టు లభించింది. అందుకే శివకాశిలో తెలుగులో ప్రసంగించి మరీ తెలుగు ఓటర్లను విశేషంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎందరో నేతల గెలుపు కోసం వ్యూహాలు రచించిన కీర్తనా సంపత్ తన సొంత జిల్లాలోని ప్రజలను ఆకట్టుకొని కొత్త వ్యూహం అమలు చేసారు. వ్యూహకర్తగా పనిచేసిన ఎక్స్పీరియన్స్తో ఆమె సోషల్ మీడియాను తన ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. కీర్తనా సంపత్ సర్వీస్ గురించి తెలుసుకున్న పలు సంస్థలు సైతం ఆమెతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చాయి. శివకాశి నియోజకవర్గంలో అత్యధికంగా ఉండే తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇతర రాజకీయ పార్టీల కంటే వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి సక్సెస్ అయ్యారు. భారీ మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో ఏకంగా మంత్రిగా అడుగు పెట్టారు.




Total views : 75363