తిరుపతి వేంకటేశ్వర వెటర్నీరీ యూనివర్సిటీ ఆవరణలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. వర్సిటీలోని క్లినికల్ సైన్సెస్ బ్లాక్లో సిబ్బంది కంటపడింది చిరుత. డిపార్ట్మెంట్ తలుపులు తీయగానే చిరుతను చూసిన మహిళా అటెండర్ భయంతో తలుపులు మూసి పరుగులు పెట్టింది. యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత తిరుగుతుండటంతో సిబ్బంది, స్థానికులు..అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు మూడు గంటలపాటు శ్రమించి చిరుతను బంధించింది హనుమాన్ టీమ్. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బందితో పాటు చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన చిరుతను అధికారులు వెంటనే ఎస్వీ జూపార్క్కు తరలించారు. ప్రస్తుతం జూపార్క్లో అటవీశాఖ సంరక్షణలో ఉన్న చిరుతకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా వర్సిటీ ప్రాంతంలో చిరుతల సంచారం భయాందోళనకు గురిచేస్తుండగా ఇప్పుడు ఏకంగా భవనాల్లోకి చొరబడుతుండడం వర్సిటీ విద్యార్థులు, సిబ్బందిలో మరింత భయం కలిగిస్తుంది.
Tag:





Total views : 89944