రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్లో జరిగే రాష్ట్ర అవతరణ ఉత్సవాలను గంటన్నరలోనే పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఉదయం 8.30 గంటలకే ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ ఉత్సవాల్లో జాతీయ పతాకావిష్కరణతో పాటు అన్ని రకాల అధికారిక అవతరణ కార్యక్రమాలను నిర్దేశిత సమయానికే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్ వేడుకలకు హాజరయ్యే అతిథులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
క్షేత్రస్థాయి కార్యకర్తలను తాను 10 రోజులకోసారి కలుస్తానని.. నెలలో మూడు రోజులు వారి కోసం సమయం కేటాయిస్తానని గాంధీభవన్లోఏర్పాటు చేసిన కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చెప్పారు. తనతో సహా ఎవరు.. ఎక్కడికి వెళ్లాలనేది పీసీసీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాకు ప్రతి 10 రోజుల్లో ఒకరోజు వెళ్లి.. పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా సమయం కేటాయించాలని పిలుపు ఇచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్పర్సన్లు, సీనియర్ నాయకులు వారంలో ఒకరోజు నియోజకవర్గాలకు వెళ్లి కార్యకర్తలను కలవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ క్యాడర్.. సోషల్ మీడియా వారియర్లుగా మారి.. పార్టీ కోసం పనిచేశారన్నారు. కానీ, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందార్లలా తయారయ్యారని… వ్యక్తిగత ప్రచారం చేసుకోవడమే తప్ప.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనీయడం లేదన్నారు. పార్టీ కోసం సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలన్నారు.ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 119 అసెంబ్లీ, 17 లోక్సభ నియోజకవర్గాల్లో ‘సర్’ పర్యవేక్షణకు ఇన్ఛార్జులను నియమించాలన్నారు.





Total views : 89168