మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో నక్సలిజం నిర్మూలన దిశగా భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని అందుకున్నాయి. మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ఆయుధ తయారీ కర్మాగారాన్ని గడ్చిరోలి పోలీసులు విజయవంతంగా ధ్వంసం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ సాగింది. ఇటీవల ‘ఆపరేషన్ అంతిమ ప్రహార్’ కింద కొందరు మావోయిస్టులు గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. వారిని పోలీసులు లోతుగా విచారించగా, అటవీ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీ సామగ్రిని భూమిలో పాతిపెట్టినట్లు వెల్లడించారు. ఈ సమాచారంతో గడ్చిరోలి పోలీస్ సూపరింటెండెంట్ ఎం. రమేష్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక ఆపరేషన్ బృందాలు రంగంలోకి దిగాయి. గడ్చిరోలి, ప్రాణహిత సంయుక్త బృందాలు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కలసి అడవిని జల్లెడ పట్టాయి. పోమ్కేం బినాగుండా ఉత్తర అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా, భూమిలో దాచిన భారీ ఆయుధ కర్మాగారం బయటపడింది. భద్రతా దళాలకు హాని కలిగించేందుకు, నక్సల్ వారోత్సవాలు, ఎన్నికల సమయంలో విరుచుకుపడేందుకు మావోయిస్టులు వీటిని దాచినట్లు సమాచారం. అయితే, ప్రమాదకరమైన ఈ సామగ్రి మొత్తాన్ని జవాన్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనా స్థలంలోనే పూర్తిగా ధ్వంసం చేశారు. గడ్చిరోలి జిల్లాలో మావోయిజం ఇప్పుడు దాదాపు అంతమైపోయిందని, అడవుల్లో దాచిన సామగ్రిని వెలికితీయడం పోలీసు దళం సాధించిన పెద్ద విజయమని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిన భద్రతా దళాలను అభినందించారు.
అడవుల్లో బయటపడ్డ మావోయిస్టుల ఆయుధ కర్మాగారం ..
42





Total views : 89030