Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National సౌదీ అరేబియా జైల్లో గత 20 ఏళ్లుగా మరణశిక్షను ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్‌ రహీమ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది.

సౌదీ అరేబియా జైల్లో గత 20 ఏళ్లుగా మరణశిక్షను ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్‌ రహీమ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది.

by CVR NEWS
సౌదీ అరేబియా జైల్లో గత 20 ఏళ్లుగా మరణశిక్షను ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్‌ రహీమ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది.

సౌదీ అరేబియా జైల్లో గత 20 ఏళ్లుగా మరణశిక్షను ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్‌ రహీమ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది. సౌదీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో అబ్దుల్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ రహీమ్‌ బతుకుదెరువు కోసం 2006లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ ఒక అరబ్ కుటుంబంలో కారు డ్రైవర్‌గా, అదే ఇంట్లోనే ఉన్న 15 ఏళ్ల పారలైజ్డ్ బాలుడికి కేర్‌ టేకర్‌గా చేరాడు. ఆ బాలుడు మెడకు అమర్చిన ఒక ప్రత్యేక వైద్య పరికరం సాయంతో శ్వాస తీసుకునేవాడు. ఒకరోజు కారులో వెళ్తున్న సమయంలో ఆ బాలుడు తీవ్రంగా గొడవ చేయడంతో, అతడిని వారించే క్రమంలో రహీమ్‌ చేయి ప్రమాదవశాత్తు ఆ శ్వాస పరికరానికి తగిలి అది ఊడిపోయింది. దాంతో ఆ బాలుడు క్షణాల వ్యవధిలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సౌదీ పోలీసులు రహీమ్‌పై హత్య కేసు నమోదు చేశారు. అది తాను కావాలని చేసింది కాదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిందని రహీమ్ ఎంత మొరపెట్టుకున్నప్పటికీ స్థానిక న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. దీనిపై పైకోర్టులకు వెళ్లినప్పటికీ, 2022లో అప్పీలు కోర్టు, ఆ తర్వాత సౌదీ సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించాయి. దాంతో రహీమ్ ప్రాణాలు దక్కడం అసాధ్యమని అందరూ భావించారు. అయితే, సౌదీ చట్టాల ప్రకారం బాధిత కుటుంబం ‘బ్లడ్‌మనీ’ (పరిహారం) తీసుకుని క్షమిస్తేనే నిందితుడికి ప్రాణభిక్ష లభిస్తుంది.

ఈ కేసును మానవతా కోణంలో పరిశీలించాలని కేరళ సమాజంతో పాటు గల్ఫ్ దేశాల్లోని NRI గ్రూప్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాయి. ఇందుకోసం ‘అబ్దుల్ రహీమ్ లీగల్ అసిస్టెన్స్ కమిటీ’ని ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్ చేపట్టారు. కేవలం కొద్దిరోజుల్లోనే ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది స్పందించి, బాధిత అరబ్ కుటుంబం డిమాండ్ చేసిన 1.5 మిలియన్ సౌదీ రియాల్స్ భారీ మొత్తాన్ని సేకరించారు. సేకరించిన ఈ బ్లడ్‌మనీని 2024లో సౌదీ కోర్టు ద్వారా బాధిత కుటుంబానికి అందజేయడంతో, వారు రహీమ్‌ను క్షమించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత కోర్టు మరణశిక్షను రద్దు చేసి, న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేసింది. అప్పటికే దాదాపు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అబ్దుల్ రహీమ్‌ను సౌదీ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసి భారత్‌కు పంపించివేసింది. ఇరవై ఏళ్ల తర్వాత కొడుకు తిరిగి వస్తుండటంతో కేరళలోని రహీమ్ కుటుంబంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018627
Total views : 89042

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.