పశ్చిమాసియాలో శాంతి ఒప్పందానికి ఒకపక్క సన్నద్ధమవుతున్న అమెరికా మరోపక్క ఇరాన్పై భీకరంగా విరుచుకుపడింది. క్షిపణి ప్రయోగక్షేత్రాలను, సముద్రంలో మందుపాతరల్ని అమరుస్తున్న పడవల్ని లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్య సైన్యం పెద్దఎత్తున దాడులకు దిగింది. ఇరాన్ దళాల ముప్పు నుంచి స్వీయరక్షణ కోసమే తమ బలగాలు ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ కెప్టెన్ టిమ్ హాకిన్స్ సమర్థించుకున్నారు. తీరం వెంట ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలు తమ దేశానికి చెందిన రెండు విమానవాహక నౌకలు, రెండు డజన్లకు పైగా యుద్ధ నౌకలకు ముప్పుగా పరిణమించినట్లు వివరించారు. తమ దాడిలో బందర్ అబ్బాస్ పోర్టులోని నౌకాదళ స్థావరం ధ్వంసమైనట్లు చెప్పారు. ఇరాన్లోని లర్క్ ద్వీపంలో కనీసం నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అమెరికా దాడుల్ని ఇరాన్ ఖండించింది. ఒప్పందం కుదిరే దిశగా చర్చలు జరుగుతుంటే ఉద్దేశపూర్వక వంచనను, అవాస్తవికతను చాటేలా ఇవి ఉన్నాయని మండిపడింది. దీని పర్యవసానాలకు అమెరికాదే బాధ్యత అని స్పష్టంచేసింది. దురాక్రమణ చర్యలన్నింటికీ బదులిస్తామని హెచ్చరించింది.






Total views : 89042