బొబ్బిలి పట్టణ అభివృద్ధికి కీలకంగా మారాల్సిన 100 అడుగుల బైపాస్ రోడ్డు… ఇప్పటికీ కాగితాలకే పరిమితం కావడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రాజా కళాశాల, గొల్ల వీధి జంక్షన్ మీదుగా గొల్లపల్లి దాడితల్లి వనం గుడి వరకు టౌన్ ప్లానింగ్ ప్రకారం ప్రతిపాదించిన ఈ రహదారి అభివృద్ధి పనులు పదేళ్లుగా ముందుకు సాగడం లేదు. కాలక్రమేణా రోడ్డు మార్గమంతా ఆక్రమణలకు గురవుతుండగా,కొన్ని చోట్ల పక్కా భవనాలు కూడా నిర్మాణమవుతున్నాయి.వీటన్నింటిని మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యలో బుడా నిధులతో కాలవల నిర్మాణం చేపడతామని ప్రకటించినా రాజకీయ ఒత్తిళ్లతో ఆ పనులు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే బేబీ నాయన పలుమార్లు రోడ్డు విస్తరణపై హామీలు ఇచ్చినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. బైపాస్ రోడ్డు అభివృద్ధి అయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి, భారీ వాహనాల రాకపోకలు పట్టణానికి దూరమవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఒక పట్టణ భవిష్యత్తు అక్కడి రోడ్లు, మౌలిక వసతులపై ఆధారపడి ఉంటుంది. కానీ బొబ్బిలిలో మాత్రం టౌన్ ప్లానింగ్ నిబంధనలు అమలు కాక ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గొల్లపల్లి వరకు ప్రతిపాదించిన 100 అడుగుల బైపాస్ రోడ్డు పూర్తిగా ఆక్రమణల బారిన పడింది. ఆ పండుగ తర్వాత, ఈ పండగ తర్వాత అంటూ అధికారుల ప్రకటనలు మాత్రమే వినిపిస్తున్నాయి తప్ప పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ సమస్యలతో నిండిపోగా, భారీ వాహనాలు నేరుగా జనావాసాల్లోకి రావడం ప్రజలకు ప్రమాదకరంగా మారుతోంది. ఈ బైపాస్ రోడ్డు అభివృద్ధి జరిగితే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా భవిష్యత్తులో బొబ్బిలి మరింత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రభుత్వం స్పందించి టౌన్ ప్లానింగ్ ప్రకారం రోడ్ల అభివృద్ధి చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.






Total views : 74956